Assam : బహుభార్యత్వానికి చెక్.. విడాకులు లేకుండా రెండో పెళ్లి చేస్తే జీతంలో 20 శాతం కోత
ఈ వార్తాకథనం ఏంటి
బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేసే దిశగా అస్సాం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనుంది. అలాంటి ఉద్యోగుల జీతంలో 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా మొదటి భార్య బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం వెల్లడించారు.
వివరాలు
మొదటి భార్యకు నేరుగా జమ
ప్రభుత్వ ఉద్యోగి తన భార్య నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఆమెను వదిలేసి మరో మహిళను వివాహం చేసుకుంటే చర్యలు తప్పవని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.
సదరు ఉద్యోగి జీతంలో 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని మొదటి భార్య బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తామని తెలిపారు.
అయితే ఇందుకోసం మొదటి భార్య ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు.
ఆమె నుంచి వచ్చిన దరఖాస్తును పరిశీలించిన అనంతరం జీతంలో కోత విధించే చర్యలు చేపడతామని వెల్లడించారు.
వివరాలు
విడాకుల కేసు కోర్టులో ఉన్నా కోత తప్పదు
ఇటీవల కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు విడాకుల ప్రక్రియ పూర్తికాకముందే మరో మహిళతో కలిసి ఉంటున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని హిమంత తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొదటి భార్యతో విడాకుల అంశం ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ జీతంలో 20 శాతం కోత కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.
న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా తొలి భార్యకు ఆర్థిక సహాయం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
వివరాలు
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10 శాతం కోత
ఇదే సమయంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులపైనా అస్సాం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనంలో 10 శాతం కోత విధించనున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.
ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.