Election Commission: అసెంబ్లీ ఎన్నికలు.. నేడు పోలింగ్ షెడ్యూల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొనబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం పోలింగ్ తేదీలను వెల్లడించనున్నట్లు సమాచారం. ఇందుకోసం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈసారి తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్ నెలల్లో వేర్వేరు తేదీల్లో ముగియనుంది.
Details
వేగం పుంజుకున్న ప్రచార కార్యక్రమాలు
ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. తుది ఓటర్ల జాబితాలను కూడా ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రకటనకు ముందే ఆయా రాష్ట్రాల్లో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో పర్యటిస్తూ రాజకీయ సభల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి విజయాన్ని సాధించాలని భారతీయ జనతా పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తమిళనాడులో ఆ పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది.