ముంబై: రన్వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ సమయంలో రన్వే నుంచి జారిపడి కుప్పకూలింది. భారీ వర్షమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీంతో విమానంలో ఉన్న ఐదుగురు ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ప్రమాదం నేపథ్యంలో రన్వైను కొద్దిసేపు మూసివేశారు. ఈ క్రమంలో ఐదు విస్తారా ఎయిర్లైన్స్ విమానాలను దారి మళ్లించారు. క్షతగాత్రులకు గాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియదు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే రన్వేపై విమానం శిథిలాలను సిబ్బంది తొలగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది.