
Patnam Narender Reddy : కలెక్టర్పై దాడి.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కొత్త మలుపు తలెత్తింది.
ఈ ఘటనకు సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆయన్ని అరెస్టు చేశారు.
లగచర్లలో జరిగిన దాడిలో పట్నం పాత్ర ఉందని అనుమానాలతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోగమోని సురేష్ పట్నం నరేందర్ రెడ్డితో పలుమార్లు ఫోన్లో సంభాషించినట్లు గుర్తించారు. అందుకే ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
Details
దాడి వెనుక బోగమోని సురేష్ హస్తం
నవంబర్ 11న వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఇతర అధికారుల వాహనాలపై గ్రామస్థులు దాడి జరిపారు.
ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు బోగమోని సురేష్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సురేష్ గ్రామస్తులను ఉసిగొల్పి దాడికి ప్రేరేపించినట్లు తెలిపారు.
దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
Details
16 మంది గ్రామస్తులు అరెస్టు
దాడి కేసులో ప్రస్తుతం 16 మంది గ్రామస్థులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు, మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.
సీసీ ఫుటేజీలు పరిశీలించి 34 మంది అనుమానితులను విడుదల చేయగా, 16 మందిని రిమాండ్కు తరలించారు.
ప్రధాన నిందితుడు సురేష్ పరారీలో ఉండటంతో ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకొని ప్రత్యేక విచారణకు ఆదేశించింది.