Ayodhya: అయోధ్యలో మరో 13 కొత్త ఆలయాల నిర్మాణం
అయోధ్యలో జనవరి 22న దివ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్యపురిలో మరో 13 కొత్త ఆలయాల నిర్మాణాన్ని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపడుతోంది. వీటిలో 6 ఆలయాలు రామమందిర్ కాంప్లెక్స్ లోపల, ఏడు ఆలయాలను బయట నిర్మిస్తోందని ఎన్డీటీవీ పేర్కొంది. కొత్త ఆలయాల నిర్మాణంపై రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరిజీ వివరించారు. ప్రధాన ఆలయ నిర్మాణ పనులతోపాటు అన్ని కార్యక్రమాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రధాన ఆలయంలో ఇప్పటి వరకు ఒక అంతస్తు పనులు మాత్రమే పూర్తయ్యింది. ప్రస్తుతం రెండో అంతస్తులో పని జరుగుతోంది.
ఏయే ఆలయాలు నిర్మిస్తున్నారు?
శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారంగా భావించబడుతున్నందున, ఆలయ సముదాయంలోని నాలుగు మూలల్లో సూర్యదేవుడు, జగదాంబకు సంబంధించిన 4 ఆలయాలను నిర్మించనున్నట్లు గురుదేవ్ గిరిజీ చెప్పారు. అన్నపూర్ణ, హనుమంతునికి ఆలయాలను కూడా గుడి లోపల నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆలయాల్లో ఇప్పటికే పనులు జరుగుతున్నాయని, విగ్రహాలను ప్రతిష్ఠించామని తెలిపారు. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. ఆలయ వెలుపల 7 ఆలయాలను నిర్మిస్తున్నట్లు గురుదేవ్ గిరిజీ వెల్లడించారు. రాముడి జీవితంలో కీలకంగా చెప్పుకునే మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాదరాజ్, మాతా శబరి, అహల్యల గుడులను ఆలయం వెలుపల నిర్మిస్తున్నట్లు చెప్పారు.