Karnataka: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ నిషేధం?.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచన!
ఈ వార్తాకథనం ఏంటి
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం విద్యార్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. అధిక వినియోగం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా చదువులో వెనుకబడుతున్నారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారులు, మైనర్ విద్యార్థుల కోసం మొబైల్, సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్ల లోపు విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల అభిప్రాయాలను కోరారు.
Details
మాదకద్రవ్యాల బారీన పడే ప్రమాదం
విద్యార్థుల్లో సోషల్ మీడియా వ్యసనం పెరగడం, మాదకద్రవ్యాల బారిన పడే ప్రమాదం అధికమవుతుండటంతో ఈ చర్యను ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆస్ట్రేలియా వంటి దేశాలు తీసుకున్న చర్యలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం విద్యార్థుల ప్రవర్తన, విద్యా ప్రగతి, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ లేకుండా ఫోన్ వాడకం కొనసాగితే దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్యాంపస్లలో మైనర్ విద్యార్థులకు మొబైల్ ఫోన్లను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తోంది.
Details
మొబైల్ ఫోన్ వినియోగంపై పరిమితులు
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆస్ట్రేలియాతో పాటు అనేక దేశాలు ఇప్పటికే విద్యార్థుల కోసం మొబైల్ ఫోన్ల వినియోగంపై పరిమితులు విధించాయని గుర్తుచేశారు. కర్ణాటకలో కూడా మైనర్ విద్యార్థులను మొబైల్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచి వారి మానసిక ఆరోగ్యాన్ని రక్షించడమే లక్ష్యమని పేర్కొన్నారు. విద్యా రంగంపై లోతైన అవగాహన కలిగిన వైస్ ఛాన్సలర్ల అభిప్రాయాలు ఈ విధానం అమలులో కీలకంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.