Shashi Tharoor: పాక్ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలి : శశిథరూర్
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు. పాకిస్థాన్లో మారుతున్న సైనిక వ్యూహాలు, అభివృద్ధి చెందుతున్న హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థలను భారత్ ఏమాత్రం తేలికగా తీసుకోకూడదని స్పష్టం చేశారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో ఉన్న గత అనుభవాల నుంచి భారత్ ఎన్నో పాఠాలు నేర్చుకుందని, అందువల్ల ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని థరూర్ తెలిపారు. డ్రోన్లు, రాకెట్లు, క్షిపణుల తర్వాత ఇప్పుడు పాకిస్థాన్ హైపర్సోనిక్ సాంకేతికతపై దృష్టిసారించిందని, ఇది భారత్కు నిర్లక్ష్యం చేసే అంశం కాదని హెచ్చరించారు.
Details
అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బంగ్లాదేశ్
పాకిస్థాన్లో ప్రజాస్వామ్యం కేవలం నామమాత్రంగానే ఉందని, ఇప్పటికీ అక్కడ సైనిక ఆధిపత్యమే కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆదేశం విదేశాల నుంచి వచ్చే సాయంపైనే ఆధారపడుతోందని చెప్పారు. అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా ప్రస్తుతం తన అంతర్గత సమస్యలతో సతమతమవుతోందని థరూర్ పేర్కొన్నారు. పాకిస్థాన్తో రక్షణ ఒప్పందంపై బంగ్లాదేశ్ చర్చలు జరుపుతోందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ శత్రువు అన్న భావనను కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పొరుగు దేశాల్లో పెరుగుతున్న భారత వ్యతిరేక ధోరణులపై ఆందోళన వ్యక్తం చేసిన థరూర్.. బంగ్లాదేశ్లో స్థిరమైన, శాంతియుత వాతావరణం భారత్కు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీస్తామంటూ వస్తోన్న హెచ్చరికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.