Mamata Banerjee: బెంగాల్ SIR వివాదం.. నేడు సుప్రీంకోర్టు విచారణకు మమతా హాజరు అయ్యే సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన కేసులో ఈరోజు (బుధవారం) సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. ఈ కేసులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఎల్ఎల్బీ పట్టా ఉన్న మమతా బెనర్జీ, ఈ కేసులో తానే స్వయంగా వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను కోరే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆమె తన న్యాయబృందం ద్వారా మధ్యంతర పిటిషన్ దాఖలు చేసి, నేరుగా కోర్టును ఉద్దేశించి వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.
వివరాలు
మమతా బెనర్జీ పేరుతో ప్రత్యేక పాస్
ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్తో పాటు జస్టిస్ జోయ్మల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పాంచోలి సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించనుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరిక్ ఓబ్రియన్, డోలా సేన్, అలాగే పిటిషనర్ మోస్తారీ బాను దాఖలు చేసిన పిటిషన్లపై ఒకేసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పేరుతో సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రవేశించేందుకు ప్రత్యేక పాస్ కూడా జారీ కావడం,ఆమె విచారణకు హాజరవుతారనే సంకేతంగా భావిస్తున్నారు. తాజాగా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లో,తాను బెంగాల్ SIR కేసులో పిటిషనర్నని,ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
వివరాలు
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు "ప్రతి తలుపు తడతాను": మమతా బెనర్జీ
అలాగే సుప్రీంకోర్టు నిబంధనలు, కోర్టు మర్యాదలు తనకు పూర్తిగా తెలుసని, న్యాయస్థాన నియమాలకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియ కారణంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులపై తనకు ప్రత్యక్ష అవగాహన ఉందని కూడా ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా,కేవలం నిన్నటివరకూ ఎన్నికల సంఘంతో SIR అంశంపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు "ప్రతి తలుపు తడతాను" అంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ ఒక ప్రధాన స్థంభమని పేర్కొన్న మమతా, ఇప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజల ముందుకు వస్తున్నానని తెలిపారు.
వివరాలు
బెంగాల్ SIR కేసు నేపథ్యం
SIR ప్రక్రియలో బాధితులుగా మారిన వారిని కెమెరాల ముందు ఉంచి, ఎన్నికలకు ముందు బెంగాల్లో జరుగుతున్న అవకతవకలను దేశం మొత్తం "కళ్లారా చూడాలి" అన్నదే తన ఉద్దేశమని ఆమె చెప్పారు. జనవరి 19న జరిగిన విచారణలో, పశ్చిమ బెంగాల్లో అమలవుతున్న SIR ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కోర్టు స్పష్టం చేసింది. "లాజికల్ డిస్క్రిపెన్సీస్"గా గుర్తించిన ఓటర్ల పేర్లను గ్రామ పంచాయతీ భవనాలు, బ్లాక్ కార్యాలయాల్లో బహిరంగంగా ప్రదర్శించాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. అదే చోట ఓటర్లు తమ ఆధార పత్రాలు సమర్పించడంతో పాటు అభ్యంతరాలు దాఖలు చేసే అవకాశం కూడా కల్పించాలని పేర్కొంది.
వివరాలు
బెంగాల్ SIR కేసు నేపథ్యం
ఎన్నికల సంఘం వివరణ ప్రకారం, 2002 ఎన్నికల జాబితాతో ఓటర్ల వివరాలు అనుసంధానం చేసే సమయంలో తలెత్తిన అసమంజసతలను "లాజికల్ డిస్క్రిపెన్సీస్"గా పరిగణిస్తున్నారు. తల్లిదండ్రుల పేర్లలో తేడాలు,లేదా ఓటరు,వారి తల్లిదండ్రుల వయస్సు మధ్య 15 సంవత్సరాల కంటే తక్కువ లేదా 50 సంవత్సరాల కంటే ఎక్కువ తేడా ఉండటం వంటి అంశాలు ఇందులోకి వస్తాయి. ఈ ప్రక్రియ విస్తృతిని గమనించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, రాష్ట్రంలో దాదాపు 1.25 కోట్ల మంది ఓటర్లను "లాజికల్ డిస్క్రిపెన్సీస్" జాబితాలో చేర్చినట్టు పేర్కొంది. అయితే, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మమతా బెనర్జీ జనవరి 28న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్లో ఎన్నికల సంఘంతో పాటు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను కూడా ప్రతివాదులుగా చేర్చారు.
వివరాలు
జ్ఞానేశ్ కుమార్కు మమతా లేఖ
ఇంతకుముందు కూడా ఆమె చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు లేఖ రాసి, ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో జరుగుతున్న SIR ప్రక్రియను "యాదృచ్ఛికం, లోపభూయిష్టం"గా అభివర్ణిస్తూ, వెంటనే నిలిపివేయాలని కోరిన విషయం తెలిసిందే.