Bengal SIR: పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా సవరణ: 58 లక్షల పేర్ల తొలగింపుకు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాలపై ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సవరణలో భాగంగా 58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరణించిన వారు, నివాసం మార్చుకున్న వారు, సంప్రదించలేని వారు అలాగే ఇతర కారణాల నేపథ్యంలో ఈ పేర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచే ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ప్రారంభమైందని ఎన్నికల సంఘం పేర్కొంది. 'ప్రత్యేక సమగ్ర సవరణ'కు సంబంధించిన ఎలక్టోరల్ రోల్స్ ముసాయిదాను మంగళవారం ప్రజల ముందుకు తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
వివరాలు
తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 2026లో విడుదల
ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 90 వేలకుపైగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) పాల్గొన్నారని చెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 4న 'సర్' పనులను ప్రారంభించారు. తొలుత ఈ పనులకు ఒక నెల గడువు నిర్ణయించగా, అనంతరం వారం రోజులు, మరోసారి మూడు రోజులు గడువును పొడిగించారు. ఈ విధంగా ఆదివారంతో ఈ సవరణ పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ 16న ముసాయిదా ఓటరు జాబితా వెలువడిన తర్వాత, ఓటర్ల చేర్పులు, మార్పులు, అభ్యంతరాలు నమోదు చేసుకునేందుకు డిసెంబర్ 16 నుంచి జనవరి 17 వరకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం తుది ఓటరు జాబితాను ఫిబ్రవరి 2026లో విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.