Bangalore: పింక్ ప్యారడైజ్గా మారిన బెంగళూరు.. ఆ మహనీయుడి కల సాకారం
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు నగరంలో వసంతం ముందుగానే వస్తుంది. ప్రతి సంవత్సరం వసంతం రాగానే ఈ మహానగరం "పింక్ ప్యారడైజ్"గా మారి మనసును హరిస్తుంది. జపాన్లో కనిపించే చెర్రీ బ్లాసమ్స్లను తలపించేలా ఇక్కడి గులాబీ పూల చెట్లు నగరాన్ని ఒక కలల లోకంలా మార్చేస్తాయి. ఎత్తునుంచి చూస్తే నగరం మొత్తం గులాబీ రంగు దుప్పటి కప్పుకున్నట్టుగా కనిపించే ఈ దృశ్యం వెనుక ఒక మహనీయుని దూరదృష్టి ఉంది. పింక్ పూలతో అలంకరించబడిన బెంగళూరు వీధుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ "పింక్ ప్యారడైజ్" వెనుక నిలిచిన ఆ మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకుందాం.
వివరాలు
నగర వీధుల్లో విస్తృత స్థాయిలో మొక్కలు
గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు ఈరోజు పూల నగరంగా మెరిసిపోవడానికి కారణం అటవీ అధికారి సేతురాం గోపాల్రావు నెగినహాల్ (S.G. Neginhal). ఆయన కేవలం ప్రభుత్వ అధికారి మాత్రమే కాదు, స్పష్టమైన దృష్టికోణం కలిగిన ఆలోచనాపరుడు. కర్ణాటక కేడర్కు చెందిన ఈ ఫారెస్ట్ ఆఫీసర్ 1980ల కాలంలో బెంగళూరు వేగంగా విస్తరిస్తున్న సమయంలో కీలక బాధ్యతలు చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి గుండూ రావు నగరాన్ని పచ్చదనంతో నింపే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆ దశ వరకు అడవుల అభివృద్ధికే పరిమితమైన అటవీ శాఖ, మొదటిసారి నగర వీధుల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటడం ప్రారంభించింది.
వివరాలు
15 లక్షల మొక్కలను నటించిన నెగినహాల్
నెగినహాల్ కేవలం చెట్లు నాటడమే కాకుండా, ప్రతి వీధికి తగిన జాతిని శాస్త్రీయంగా ఎంపిక చేశారు. 1982 నుంచి 1987 వరకు స్థానికుల అభిప్రాయాలను తెలుసుకుంటూ సుమారు 15 లక్షల మొక్కలను నాటించారు. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నాటిన మొక్కల్ని పశువులు, ప్రజల నుండి కాపాడటం మొదలు, వాటిని సంరక్షణ లాంటి అనేక సవాళ్లను శ్రద్ధగా నిర్వహంచారు.
వివరాలు
నెగినహాల్ రూపొందించిన విశిష్ట ప్రణాళిక
బెంగళూరు వీధుల్లో ఒకేసారి ఒకే రంగు పూలు విరబూయేలా ఆయన ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించారు. వసంత కాలంలో ఒక వీధి మొత్తం పసుపు రంగులో (Tabebuia Argentea), మరొక వీధి గులాబీ రంగులో (Tabebuia Rosea) మెరిసేలా రూపకల్పన చేశారు. టాబెబుయా రోసియా (Tabebuia Rosea): ప్రస్తుతం మనం చూస్తున్న గులాబీ పూల చెట్లు విదేశీ జాతికి చెందినవే. బెంగళూరు వాతావరణానికి ఇవి అనుకూలమని గుర్తించి వేల సంఖ్యలో నాటించారు.
వివరాలు
2024లో నెగినహాల్ మృతి
2024లో నెగినహాల్ పరమపదించినప్పటికీ, ఆయన నాటించిన లక్షలాది చెట్లు ప్రతి వసంతంలో విరబూసి ఆయన జ్ఞాపకాన్ని నిలబెడుతున్నాయి. ముఖ్యంగా కబ్బన్ పార్క్, లాల్బాగ్, మల్లేశ్వరం, జయనగర్ వంటి ప్రాంతాల్లో పూల వర్షం కురిసినట్లుగా నేలంతా గులాబీ రేకులతో కప్పబడిన దృశ్యం హృదయాన్ని హత్తుకుంటుంది. ఆయన దూరదృష్టి, పర్యావరణంపై ఉన్న నిబద్ధత మరింత మందికి ప్రేరణగా నిలవాలని ఆశిద్దాం.