Telugu University: తెలుగు వర్సిటీలో భక్త రామదాసు కీర్తనలపై ఏడాది కోర్సు
ఈ వార్తాకథనం ఏంటి
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంగీత విభాగం ఆధ్వర్యంలో భక్తి సంగీతాభిమానులు, సంగీతంపై ఆసక్తి కలిగిన వారికి ప్రత్యేకంగా "భక్త రామదాసు కీర్తనలు" పేరుతో ఏడాది వ్యవధి గల ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సుకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా లోకభవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు భక్తి సంగీత పరంపరను కాపాడటంతో పాటు భక్త రామదాసు కీర్తనల సాహిత్య, సంగీత మహిమాన్వితాన్ని యువతకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ కోర్సును రూపొందించినట్లు తెలిపారు.
వివరాలు
కోర్సు రుసుమును రూ.5వేలు
రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ.. ఈ కోర్సులో భక్త రామదాసు జీవిత విశేషాలు, కీర్తనల భావ వివరణ,రాగతాళాల పరిచయం,గాన విధానం,వేదికపై ప్రదర్శన తీరు వంటి అంశాలను అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఆన్లైన్లో బోధించనున్నట్లు వెల్లడించారు. సంగీతంలో కనీస అవగాహనతో పాటు 10సంవత్సరాల పైబడిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కోర్సు రుసుమును రూ.5వేలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలో నిర్వహించనున్న ప్రవేశాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో నివసించే సంగీతాభిమానులు కూడా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సులో పాల్గొనే వీలుండటంతో మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్సు సమన్వయకర్త డా.శేషులత,విద్యా విభాగ సంచాలకురాలు డా.వనజ ఉదయ్లు కోర్సు విశేషాలను గవర్నర్కు వివరించారు.