LOADING...
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? రాజకీయ వర్గాల్లో చర్చలు 
ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? రాజకీయ వర్గాల్లో చర్చలు

Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? రాజకీయ వర్గాల్లో చర్చలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. కూటమి పార్టీల మధ్య స్థానాల పంపకాలపై చర్చలు జరుగుతున్న సమయంలో, భారతీయ జనతా పార్టీ కోటాలో తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేరు అనూహ్యంగా ముందుకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడులో దూకుడు రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనను ఏపీ నుంచి పెద్దల సభకు పంపించే అంశాన్ని పార్టీ ఉన్నత నాయకత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూన్ నెలలో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి ఈ నాలుగు స్థానాలను గెలుచుకునే స్థాయి బలం ఉంది.

వివరాలు 

ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో బీజేపీకి ఒకటి కేటాయించే అవకాశం

కూటమి ఒప్పందం ప్రకారం రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీకి, ఒకటి జనసేన, మరొకటి భారతీయ జనతా పార్టీకి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు డి.మాధవ్‌ మధ్య ఈ విషయంపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి దక్కే స్థానాన్ని అన్నామలైకు ఇవ్వాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయనకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన పార్టీకి ఉందని సమాచారం.

వివరాలు 

జనసేన నుంచి తొలిసారిగా పెద్దల సభకు సభ్యుడు.. రేసులో లింగమనేని రమేశ్

గతంలో కూడా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పుడు ఏపీ కోటాలో అన్నామలై పేరు వినిపించింది. అయితే ఆ సమయంలో ఏపీకే చెందిన నాయకుడు పాక వెంకట సత్యనారాయణకు అవకాశం లభించింది. దీంతో ఈసారి ఆయనకు అవకాశం దక్కుతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక జనసేన పార్టీ తరఫున తొలిసారి ఒకరు పెద్దల సభలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త రమేష్ లింగమనేని పేరు బలంగా వినిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి కేటాయించే రెండు స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుత ఎంపీ సానా సతీష్'కు మళ్లీ అవకాశం ఇస్తారా లేదా అన్నది చర్చనీయాంశమైంది.

Advertisement

వివరాలు 

టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం.. రేసులో పలువురు సీనియర్లు, పారిశ్రామికవేత్తలు

ఆయనకు బదులుగా పార్టీ కీలక బాధ్యతలు ఇచ్చి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించే అవకాశమూ ఉందని సమాచారం. అలాగే మంత్రి నారా లోకేశ్ కు సన్నిహితుడిగా భావించే కిలారి రాజేష్ పేరు కూడా పరిశీలనలో ఉంది. వీరితో పాటు భారత్ బయోటెక్ అధిపతి Krishna Ella, మాజీ మంత్రులు Yanamala Ramakrishnudu, Devineni Umamaheswara Rao, సీనియర్ నాయకుడు Varla Ramaiah పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద అన్నామలై పేరు తెరపైకి రావడంతో ఏపీ రాజ్యసభ ఎన్నికల రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. కూటమిలోని పార్టీలు చివరికి ఎవరిని ఎంపిక చేస్తాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement