PM Modi: బెంగళూరులో బాంబు కలకలం.. ప్రధాని మోదీ భద్రతపై పెరిగిన ఉత్కంఠ
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు కలకలం రేగింది. ప్రధాని పాల్గొనే కార్యక్రమ వేదికకు సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు శివార్లలోని కనకపుర రోడ్డుపై ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అంతర్జాతీయ కేంద్రానికి ప్రధాని చేరుకునే కొద్ది గంటల ముందే, సమీపంలోని ఫుట్పాత్పై రెండు జిలెటిన్ స్టిక్స్ కనిపించాయి.
వివరాలు
ఎలా బయటపడింది?
ఆదివారం ఉదయం భద్రతా బలగాలు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, కాగలిపుర సమీపంలోని ఓ ఆశ్రమం వద్ద ఫుట్పాత్ పక్కన అనుమానాస్పద వస్తువులు గుర్తించారు. పరిశీలించగా అవి జిలెటిన్ స్టిక్స్గా తేలింది. ఈ ప్రాంతం ప్రధాని పాల్గొనే కార్యక్రమ వేదికకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో భద్రతా వ్యవస్థలు వెంటనే అలర్ట్ అయ్యాయి. బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇవి మైనింగ్ అవసరాల కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలా? లేక ప్రధాని పర్యటనను లక్ష్యంగా చేసుకున్న కుట్రలో భాగమా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేడుకల్లో ప్రధాని
భద్రతా ఉత్కంఠ మధ్య కూడా ప్రధాని తన పర్యటనను కొనసాగించారు. శ్రీ శ్రీ రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికత, సామాజిక మార్పు కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని (మెడిటేషన్ హాల్) ఆయన ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రధాని ప్రసంగించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండింటినీ వేర్వేరుగా చూడలేమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే బెంగళూరు కేవలం టెక్నాలజీ హబ్ మాత్రమే కాకుండా భారత ఆధ్యాత్మిక చైతన్యానికి కూడా ప్రతీకగా నిలుస్తోందని కొనియాడారు.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్
ప్రధాని పర్యటనకు ముందు పేలుడు పదార్థాలు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ జిలెటిన్ స్టిక్స్ అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు ఉంచారు? అనే విషయాలపై భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేవని అధికారులు స్పష్టం చేశారు.