IndiGo: బాంబు బెదిరింపుల గండం.. రెండు ఇండిగో విమానాలకు బెదిరింపు మెయిల్
ఈ వార్తాకథనం ఏంటి
విమానాలకు బాంబు బెదిరింపుల ముప్పు తగ్గడం లేదు. తాజాగా రెండు ఇండిగో విమానాలకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ తీవ్ర కలకలాన్ని రేపాయి. జిద్దా నుంచి వస్తున్న ఒక ఇండిగో విమానానికి, అలాగే కేరళలోని కొచ్చి నుంచి వస్తున్న మరో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్స్ అందాయి. విమానాల్లో ఆర్డీఎక్స్ పెట్టామని, ఎప్పుడైనా పేలిపోయే ప్రమాదం ఉందని ఈ మెయిల్స్లో పేర్కొనడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలను ఐసోలేషన్కు తరలించి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
Details
విమానాశ్రయ అధికారులు మరింత అప్రమత్తం
ఇదిలా ఉండగా, కోల్కత్తా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్న మరో ఇండిగో విమానానికి సంబంధించి కూడా ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరువవుతున్న సమయంలో, విమానం పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఫిర్యాదు చేశాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సుమారు ఏడు నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా, మొయినాబాద్-చిలుకూరు బాలాజీ ప్రాంతం వైపు నుంచి విమానంపై లేజర్ లైట్ వేయబడిందని పైలెట్ తెలిపాడు. ఈ వరుస ఘటనలతో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో పాటు, పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.