
Bomb Threat: చెన్నైలోని పలు విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైలోని తేనాంపేట ప్రాంతంలో మంగళవారం కేవలం అమెరికా కాన్సులేట్ మాత్రమే కాదు, సింగపూర్, కొరియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బ్రిటన్ సహా మొత్తం 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు ఈమెయిల్ ద్వారా చేరినట్లు గుర్తించారు. ఈ బెదిరింపులు కరూర్ తొక్కిసలాట ఘటన, డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరును ప్రస్తావిస్తూ పది వేరువేరు ఈమెయిల్ ఐడీల ద్వారా పంపబడినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ ఎంబసీలకు వచ్చే ఈ బెదిరింపుల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తతతో గాలింపు చర్యలు చేపట్టాయి. అన్ని కాన్సులేట్లలో బాంబు స్క్వాడ్ బృందాలు, డాగ్ స్వాడ్ల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి.
Details
విమానంలో 200 మంది ప్రయాణికులు
అలాగే, కాన్సులేట్ల చుట్టూ భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. ఇదే సమయంలో ముంబయి-దిల్లీ మధ్య విహరించిన ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈమెయిల్ అందుకున్న తర్వాత అప్రమత్తమైన ఎయిర్లైన్స్ అధికారులు దిల్లీ విమానాశ్రయానికి సమాచారమిచ్చి, పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. గాలింపు చర్యల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లపై ఆందోళన కలిగిస్తున్నాయి.