Kavitha: ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత
లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 23 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి దిల్లీ కోర్టు శనివారం అప్పగించింది. ఈ కేసులో శుక్రవారం కవితను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో కవితను ఈడీ హాజరుపర్చింది. విచారణ నిమిత్తం కవితను 10రోజుల రిమాండ్కు అప్పగించాలని ఈడీ కోరింది. దీంతో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఎంకె.నాగ్పాల్ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అరెస్టుకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలను సమర్పించారు.