LOADING...
India's energy imports: జాతీయ ప్రయోజనాలే ఇంధన దిగుమతులకు మార్గదర్శకం: విక్రమ్ మిస్రీ
జాతీయ ప్రయోజనాలే ఇంధన దిగుమతులకు మార్గదర్శకం: విక్రమ్ మిస్రీ

India's energy imports: జాతీయ ప్రయోజనాలే ఇంధన దిగుమతులకు మార్గదర్శకం: విక్రమ్ మిస్రీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తుందన్న ప్రచారం నడుస్తున్న సమయంలో,దేశ ఇంధన దిగుమతుల విధానం పూర్తిగా జాతీయ ప్రయోజనాలు,వినియోగదారులకు భారం కాకుండా ఉండటం, సరఫరా భద్రత అనే అంశాల ఆధారంగానే ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఇక భారత్ చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మిస్రీ, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశం చమురు,గ్యాస్ అవసరాలకు 80 నుంచి 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతుందని,అందువల్ల ఇంధన ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు. భారత వినియోగదారుల ప్రయోజనాల రక్షణే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని తెలిపారు.

వివరాలు 

గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను స్థిరంగా ఉంచడంలో భారత్ కీలక పాత్ర

గత కొన్ని ఏళ్లుగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొనడం వల్ల ధరలు,సరఫరా గొలుసులు ప్రభావితమయ్యాయని,అందుకే ఒక్క దేశంపైనే ఆధారపడకుండా అనేక దేశాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని చెప్పారు. భారత్ ప్రపంచంలో పెద్ద ఇంధన వినియోగదారులలో ఒకటే కాకుండా, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను స్థిరంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. అందుబాటు, సమంజసమైన ధరలు, నమ్మకమైన సరఫరా అనే అంశాలే ఇంధన దిగుమతుల విధానానికి కేంద్రబిందువని, అధికారిక గణాంకాల ప్రకారం భారత్ డజన్ల కొద్ది దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని తెలిపారు.

వివరాలు 

140 కోట్ల మంది అవసరాలే భారత్ ఇంధన నిర్ణయాలకు ఆధారం 

మార్కెట్ పరిస్థితులను బట్టి వనరుల మిశ్రమం మారుతుందే తప్ప, ఏ ఒక్క దేశంపై ఆధారపడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. చమురు కొనుగోలు నిర్ణయాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలే మార్కెట్ పరిస్థితులు, ఖర్చులు, ప్రమాదాలు చూసుకొని తీసుకుంటాయని, చివరికి ప్రభుత్వమైనా, సంస్థలైనా జాతీయ ప్రయోజనాలే మార్గదర్శకమని మిస్రీ అన్నారు. ట్రంప్-మోదీ మధ్య ప్రకటించిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ రష్యా చమురు కొనుగోళ్లు నిలిపేస్తుందని, అమెరికా నుంచి ఎక్కువ ఇంధనం కొనుగోలు చేస్తుందని ట్రంప్ చేసిన ప్రకటనలపై న్యూఢిల్లీ మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని, 140 కోట్ల మంది అవసరాలే భారత్ ఇంధన నిర్ణయాలకు ఆధారమని విదేశాంగ శాఖ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement