Census 2027: జనగణన 2027 స్టార్ట్.. మొబైల్లోనే వివరాలు నమోదు చేసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా జనగణన 2027 తొలి దశ ఈరోజు ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక సేకరణ కార్యక్రమంగా నిలవనుండగా, పూర్తిగా డిజిటల్ రూపంలో జరుగుతున్న తొలి జనగణన కావడం విశేషం. ఇది భారతదేశంలో 16వ జనగణన కాగా, స్వాతంత్య్రం తర్వాత 8వది. ఇందులో తొలిసారి సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈసారి జనగణన రెండు దశల్లో నిర్వహించనున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన రూ. 11,718.24 కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియ కొనసాగనుంది.
వివరాలు
సెప్టెంబర్ వరకూ హౌసింగ్ జనగణన
మొదటి దశగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్ లిస్టింగ్, హౌసింగ్ జనగణన చేపడతారు. ఇందులో ఇళ్ల పరిస్థితి, అందుబాటులో ఉన్న సదుపాయాలు, కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలను సేకరిస్తారు. ఈ దశలో మొత్తం 33 ప్రశ్నలు అడగనున్నారు. రెండో దశగా 2027 ఫిబ్రవరిలో జనాభా వివరాల సేకరణ జరుగుతుంది. ఇందులో వ్యక్తుల జనాభా గణాంకాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, విద్య, వలసలు, జననాల వివరాలు వంటి అంశాలు నమోదు చేస్తారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా ఈసారి కుల గణాంకాలను కూడా డిజిటల్ రూపంలో సేకరించనున్నారు. ప్రధాన సూచన తేదీగా 2027 మార్చి 1 అర్ధరాత్రిని నిర్ణయించగా, లడాఖ్ వంటి మంచు ప్రాంతాల్లో 2026 అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
వివరాలు
16 భాషల్లో మొబైల్ యాప్ ద్వారా సర్వే
ఈ డిజిటల్ జనగణనలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిసారిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయం కల్పించారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా పౌరులు తమ మొబైల్ నంబర్తోనే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇది ఇంటింటి సర్వే ప్రారంభానికి 15 రోజుల ముందే అందుబాటులో ఉంటుంది. ఇక ఫీల్డ్ సిబ్బంది కోసం 16 భాషల్లో మొబైల్ యాప్ అందుబాటులో ఉంచారు. సుమారు 30 లక్షల మంది సిబ్బంది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల ద్వారా డేటా సేకరణ చేస్తారు. అలాగే ప్రతి భవనాన్ని జియో ట్యాగింగ్ చేయడం కూడా ఈసారి ప్రత్యేకం. డిజిటల్ లేఅవుట్ మ్యాపింగ్ ద్వారా భవనాలను గుర్తించి డేటా ఖచ్చితత్వాన్ని పెంచడం లక్ష్యం.
వివరాలు
గోప్యంగా వివరాలు..
జనగణన ప్రచారంలో భాగంగా 'ప్రగతి', 'వికాస్' అనే మాస్కాట్లను కూడా ప్రవేశపెట్టారు. వీటి ద్వారా ప్రజలకు సమాచారం సులభంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియను హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ పర్యవేక్షిస్తోంది. సేకరించిన వ్యక్తిగత సమాచారం సెన్సస్ చట్టం 1948 ప్రకారం గోప్యంగా ఉంచబడుతుంది. ఈ వివరాలను ఆర్టీఐ ద్వారా పొందడం లేదా కోర్టు కేసుల్లో వినియోగించడం అనుమతించబడదు.