Page Loader
Andhra Pradesh 7 National Highways: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు

Andhra Pradesh 7 National Highways: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2024
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్ల కోసం రెండు రోజుల క్రితం రూ.400 కోట్లకుపైగా విడుదల చేయగా.. తాజాగా,భారతమాల పరియోజన మొదటి దశ కింద రాష్ట్రానికి మంజూరైన 7 నేషనల్ హైవేల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతేడాది ఈ ప్రాజెక్టులు మంజూరు చేసినా, వాటి టెండరింగ్ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే, ఇప్పుడు కేంద్రం అన్నింటినీ ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రహదారులు,భవనాల శాఖ కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది. రాష్ట్రంలో మొత్తం 384 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణానికి ముందుగా అంచనా ప్రకారం రూ. 6,646 కోట్ల ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ వ్యయాన్ని రూ. 6,280 కోట్లకు తగ్గించారు.

వివరాలు 

కొండమోడు-పేరేచెర్ల సెక్షన్ విస్తరణ

కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టుల్లో కొండమోడు-పేరేచెర్ల సెక్షన్ విస్తరణ,నేషనల్ హైవే 167 ఏజీలో 49.917 కిలోమీటర్లను రూ.881.61 కోట్లతో నాలుగు లైన్‌లుగా విస్తరించడం,ఎన్‌హెచ్‌ 167కెలో సంగమేశ్వరం-నల్లకాలువ,వెలిగొండ-నంద్యాల మధ్య 62.571 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 601 కోట్ల వ్యయంతో రెండు లైన్లుగా విస్తరించడం ఉన్నాయి. ఎన్‌హెచ్‌ 167కె(కొత్తగా జాతీయ రహదారిగా ప్రకటించారు)నంద్యాల-కర్నూలు/కడప బోర్డర్ సెక్షన్‌ను 62 కిలో మీటర్ల మేర ఆధునికీకరించేందుకు రూ. 691 కోట్లు కేటాయించారు. జాతీయ రహదారి 716జిలోని ముద్దనూరు-హిందూపురం సెక్షన్‌లో 33.58 కిలోమీటర్ల మార్గాన్నిరూ. 808 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. జాతీయ రహదారి 716జిలో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి సెక్షన్‌ వరకు 56.5 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 1,019.97 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

వివరాలు 

రూ. 1,321 కోట్లతో రెండు,నాలుగు వరుసల రహదారి

ఉమ్మడి కడప జిల్లాలో ఎన్‌హెచ్‌-440లో వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు (ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా) ఉన్న 78.95 కిలోమీటర్ల రహదారిని రూ. 1,321 కోట్లతో రెండు, నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. జాతీయ రహదారి 516బిలో పెందుర్తి నుంచి ఎస్‌.కోట మార్గంలో ఉన్న 40.5 కిలోమీటర్ల రోడ్డును రూ. 956.21 కోట్లతో 2, 4 వరుసలుగా విస్తరిస్తారు.

వివరాలు 

సత్తెనపల్లి, మేడికొండూరుల దగ్గర రెండు బైపాస్ రోడ్లు

కేంద్రం చేపట్టబోతున్న ఈ ఏడు ప్రాజెక్టుల్లో తొలి రెండు ప్రాజెక్టులకు గతంలోనే టెండర్లు పిలవగా, ఇద్దరు ఎల్‌-1గా నిలిచారు. ఆ ప్రాజెక్టులకు సంబంధించి, ఆ రెండు సంస్థలు కోట్ చేసిన మొత్తానికే తాజా ధరలను నిర్ణయించి అంచనాలను ఇప్పటికే సవరించారు. కొండమోడు-పేరేచెర్ల రోడ్డు విస్తరణలో భాగంగా దానికి అనుబంధంగా సత్తెనపల్లి, మేడికొండూరుల దగ్గర రెండు బైపాస్ రోడ్లు నిర్మించనున్నట్లు నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీలో ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయించిన కేంద్రానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.