Malla Reddy Deemed University: తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతిలో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్, మాజీ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. శుక్రవారం శ్రీవాణి దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. గత 35 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో కూడా ఒక యూనివర్సిటీని స్థాపించే అవకాశం కల్పించాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో కేంద్ర ప్రభుత్వం డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు.
వివరాలు
వివాదాస్పదంగా మల్లారెడ్డి విద్యాసంస్థలకు సంబంధించిన కరపత్రం ప్రదర్శన
రేణిగుంట సమీపంలోని పాత కళాశాల భవనాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణకు చెందిన వ్యక్తిగా గర్వంగా భావిస్తున్నానని అన్నారు. అయితే, శ్రీవారి ఆలయం వెలుపల మల్లారెడ్డి విద్యాసంస్థలకు సంబంధించిన కరపత్రాన్ని ప్రదర్శించడం వివాదాస్పదంగా మారింది. ఆలయ పరిసరాల్లో ప్రైవేటు లేదా వాణిజ్య సంస్థలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదనే నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది.