Delhi Bomb Blast: బాంబు పేలుడు ఉగ్ర ఘాతుకమే.. ఎర్రకోట సమీపంలో పేలుడుపై కేంద్ర క్యాబినెట్ స్పష్టీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఉగ్రవాదుల చేత చేసిన దారుణ దాడేనని కేంద్ర మంత్రివర్గం స్పష్టంచేసింది. ఈ ఘటనను మానవత్వం లేని హింసాత్మక చర్యగా, పిరికిపందల దాడిగా పేర్కొంది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి, బాధితులకు సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ ఘటనను అత్యంత కీలకమైనదిగా పరిగణించి, దర్యాప్తు సంస్థలు వృత్తి నిపుణతతో వేగంగా దర్యాప్తు జరిపి, దోషులను అలాగే వారి వెనుక ఉన్న వారిని త్వరితగతిన చట్టం ముందుకు తీసుకురావాలని ఆదేశించింది.
వివరాలు
ఉగ్రవాదాన్ని మూలంతో నిర్మూలించడం ప్రభుత్వ విధానం
భూటాన్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సాయంత్రం కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా రెండు నిమిషాల మౌనం పాటించారు. ఉగ్రవాదాన్ని మూలంతో నిర్మూలించాలనే ప్రభుత్వ విధానంపై తమ కట్టుబాటును క్యాబినెట్ మరోసారి పునరుద్ఘాటించింది. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. "దేశ వ్యతిరేక శక్తులు పన్నిన ఈ దారుణ ఉగ్రదాడిలో నిరపరాధులు బలయ్యారు, మరెందరో గాయపడ్డారు. ఈ ఘటనను మంత్రివర్గం తీవ్రంగా ఖండిస్తోంది" అని తీర్మానంలో పేర్కొంది.
వివరాలు
ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో సమీక్ష
ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు క్యాబినెట్ సమావేశం వివరించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఘటన అనంతరం తక్షణమే సహాయక చర్యలు చేపట్టి వైద్యం అందించిన భద్రతా సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజలను ప్రశంసించింది. దేశ పౌరుల భద్రత, ప్రశాంత జీవనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్గం మరోసారి స్పష్టంచేసింది. ఈ సమావేశ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.