Rahul Gandhi: సర్టిఫికెట్లు ఉద్యోగాలు ఇప్పించలేవు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో ఉన్న సుమారు 40 కోట్ల మంది యువతే దేశానికి అసలైన సంపద అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ యువత సామర్థ్యానికి ప్రపంచంలోనే ఎవరూ సాటిరారని పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 'విద్యార్థుల గళం' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యువత ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో స్టడీ సర్టిఫికెట్లకు విలువ లేకుండా పోయిందని రాహుల్ గాంధీ అన్నారు. అవి యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగం పొందాలంటే కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని వ్యాఖ్యానించారు. ''అమెరికా, చైనా, రష్యాల గురించి ఎంతో మాట్లాడుకుంటున్నప్పటికీ.. మన దేశ యువతకు ఎవరూ సాటిలేరు. కానీ, ఈ రోజుల్లో మన దేశంలో స్టడీ సర్టిఫికెట్లకు విలువ లేదు.
వివరాలు
ద్వేషం, హింసకు తావివ్వరాదు
అవి మీకు ఉద్యోగాలు ఇప్పించలేవు. దేశంలో ఉపాధికి సంబంధించిన అన్ని దారులు మూసుకుపోయాయని రాహుల్ గాంధీ అన్నారు.
తయారీ రంగం పడిపోవడం, రుణాలు పొందడంలో ఇబ్బందులు, పరీక్ష పత్రాల లీకేజీ, ఉద్యోగాలను కృత్రిమ మేధ (ఏఐ) భర్తీ చేయడం వంటి పరిణామాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలపైనా రాహుల్ గాంధీ స్పందించారు. యువత తమ భయాలను పక్కనపెట్టి చీకటిలో ఓ చిరు దీపం వెలిగించారని, తద్వారా దేశంలో మార్పునకు దోహదపడ్డారని అన్నారు.
అయితే దేశంలో మార్పు తీసుకొచ్చే క్రమంలో ద్వేషం, హింసకు తావివ్వరాదని రాహుల్ గాంధీ యువతకు సూచించారు. ప్రేమ, ఆప్యాయతలతోనే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.