Delhi: 'చలో సంసద్'కు ముందు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 5 వేల మంది పోలీసులతో హై అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు దేశ రాజధాని దిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించిన 'చలో సంసద్' మార్చ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. హై సెక్యూరిటీ జోన్గా గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. సీజేపీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు భారీ నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని,విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
వివరాలు
15 భద్రతా జోన్లుగా న్యూఢిల్లీ
ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో భాగంగా 5 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని విధుల్లోకి దించారు.
అదనంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కుపైగా బెటాలియన్లను కీలక ప్రాంతాల్లో మోహరించారు. మహిళా పోలీసు సిబ్బందిని కూడా ప్రత్యేకంగా నియమించారు.
నిరసనల దృష్ట్యా న్యూఢిల్లీ ప్రాంతాన్ని 15 భద్రతా జోన్లుగా విభజించారు.
ప్రతి జోన్కు ఒక సీనియర్ పోలీసు అధికారిని బాధ్యుడిగా నియమించి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు.
ఇంటెలిజెన్స్ విభాగం, ఢిల్లీ పోలీసుల స్పెషల్ బ్రాంచ్ నిరసనకారుల రాకపోకలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాయి.
సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే అన్ని విభాగాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు
కీలక ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగింపు
విజయ్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, ప్రధానమంత్రి నివాసం, సేవా తీర్థ, ఇండియా గేట్ పరిసరాలు, రాష్ట్రపతి భవన్ తదితర అత్యంత భద్రతా ప్రాంతాల్లో ఎలాంటి నిరసనలు, సమావేశాలు లేదా ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఢిల్లీలో ప్రస్తుతం సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు.
అధికారుల అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధితమని తెలిపారు.
వివరాలు
వాటర్ క్యానన్లు, యాంటీ రయట్ బలగాలు సిద్ధం
నిరసనల సమయంలో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు వాటర్ క్యానన్లు, వజ్రా యాంటీ రయట్ వాహనాలు, ప్రత్యేక పోలీసు బృందాలను సిద్ధంగా ఉంచారు.
ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు, రిజర్వ్ బలగాలను కూడా అప్రమత్తంగా ఉంచి అవసరమైన వెంటనే రంగంలోకి దించేలా ఏర్పాట్లు చేశారు.
మెట్రో స్టేషన్లలో ప్రత్యేక నిఘా కొనసాగుతుండగా, పరిస్థితులను బట్టి కొన్ని స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసే అవకాశముందని అధికారులు తెలిపారు.
అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమీప ఆసుపత్రులను కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఢిల్లీకి వచ్చే అన్ని ప్రధాన మార్గాల్లో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. బారికేడ్లు, సీసీటీవీ నిఘా, యాంటీ సబోటేజ్ తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతున్నాయి.
వివరాలు
'మార్చ్ను ఎవరూ అడ్డుకోలేరు': అభిజీత్ దీప్కే
'చలో సంసద్' కార్యక్రమం దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రజా నిరసనల్లో ఒకటిగా నిలుస్తుందని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, గత 10 నుంచి 12 సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
నెల రోజులుగా కొనసాగుతున్న జంతర్ మంతర్ నిరసనలతో ప్రజాస్వామ్య స్ఫూర్తి మళ్లీ బలపడిందని అన్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఢిల్లీకి చేరుకుంటున్నారని ఆయన తెలిపారు.
వివరాలు
'మార్చ్ను ఎవరూ అడ్డుకోలేరు': అభిజీత్ దీప్కే
తాను అమెరికాలో ఉన్న సమయంలో ఈ ఉద్యమం సోషల్ మీడియాలో మాత్రమే పరిమితమవుతుందని, ప్రజలు రోడ్లపైకి రారని చాలామంది వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం జంతర్ మంతర్కు చేరుకునే నాలుగు ప్రధాన రహదారులు నిరసనకారులతో నిండిపోయాయని చెప్పారు.
పార్లమెంట్ వైపు చేపట్టిన తమ శాంతియుత మార్చ్ను ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేసిన ఆయన, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ దృష్టికి తమ డిమాండ్లను తీసుకెళ్లడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.