Page Loader
Happy Birthday Chandrababu : చంద్రబాబు 75వ బర్త్‌డే.. ఐటీ హబ్ హైదరాబాదు నుంచి అమరావతి దిశగా అభివృద్ధి పయనం 
చంద్రబాబు 75వ బర్త్‌డే.. ఐటీ హబ్ హైదరాబాదు నుంచి అమరావతి దిశగా అభివృద్ధి పయనం

Happy Birthday Chandrababu : చంద్రబాబు 75వ బర్త్‌డే.. ఐటీ హబ్ హైదరాబాదు నుంచి అమరావతి దిశగా అభివృద్ధి పయనం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఆదివారం తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నేతగా, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ నక్షత్రంగా తీర్చిదిద్దిన దార్శనికుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం.

Details

కాంగ్రెస్ తో రాజకీయ ప్రస్థానం ప్రారంభం

1950, ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ఒక సాదాసీదా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం 1970లలో కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమై, 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా సేవలందించిన తర్వాత, 1983లో తన మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరడం, 1984 సంక్షోభంలో పార్టీని నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించడం ఆయన రాజకీయ జీవితంలో మలుపులు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్న చంద్రబాబు, 1995లో తొలిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 2004 వరకు పనిచేశారు.

Details

పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా సేవలు

ఆపై పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించి, 2014లో విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో పరాజయం, 2023లో నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్టు, అనంతరం బెయిల్ వంటి కష్టాలను ఎదుర్కొన్న ఆయన, 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు పాలనలో ఐటీ రంగాభివృద్ధి గుర్తుండిపోయే ఘట్టం. ఆయన తొలితరం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998లో హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నగరానికి మౌలిక వృద్ధిని తెచ్చాయి.

Details

సైబర్ బాబుగా గుర్తింపు

ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనడం, బిల్ గేట్స్‌, బిల్ క్లింటన్‌లను కలవడం వంటి కార్యకలాపాల ద్వారా తెలంగాణ రాజధాని పేరు ఖ్యాతులను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. ఆర్థిక సంస్కరణలపట్ల ఆయన అవలంబించిన విధానం కారణంగా, ప్రపంచ బ్యాంకు నేరుగా రుణం మంజూరు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం విశేషం. టైమ్ మ్యాగజైన్ 1999లో ఆయనను 'సౌత్ ఏషియన్ ఆఫ్ దిఇయర్'గా గుర్తించగా, ఇండియా టుడే ఆయనను 'ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం'గా ప్రకటించింది. 2014 నుంచి 2019 మధ్య ఆయన అమరావతి నిర్మాణాన్ని శ్రీకారం చుట్టారు. ఈకాలంలో రాష్ట్రం 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో అగ్రస్థానానికి చేరింది. సాంకేతికత పట్ల ఆయన చూపిన ఆసక్తి కారణంగా 'సైబర్ బాబు'గా పేరుగాంచారు.

Details

విదేశీ పర్యటనలో చంద్రబాబు నాయుడు కుటుంబం

పార్టీ కార్యకలాపాల్లో టెక్నాలజీ వినియోగం, డేటా ఆధారిత మేనేజ్‌మెంట్ పద్ధతులు ఆయన ఆధునిక దృక్పథానికి నిదర్శనాలు. ప్రస్తుతం 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన విదేశాల్లో కుటుంబంతో కలిసి పర్యటనలో ఉన్నారు. ఈ టూర్‌లో భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌ భాగస్వాములయ్యారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో మహిళలు ఫింగర్ ప్రింట్ ఆర్ట్ ద్వారా ఆయన పట్ల తమ అభిమానాన్ని చాటారు.

Details

పుట్టిన రోజు కానుకగా మెగా డీఎస్సీ విడుదల

ఈ సందర్భంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడం కూడా ఎంతో మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు పుట్టినరోజు కానుకగా నిలిచింది. 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ ప్రకటన, ఆయన పాలనలో తక్షణ ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేసే విధంగా నిలిచింది. సంపూర్ణ రాజకీయ జీవితం అంతా ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు, దార్శనికత, వినూత్న ఆలోచనలతో రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసిన అరుదైన నేత. 75 ఏళ్ల వయస్సులోనూ మునుపటిలానే చురుకుగా వ్యవహరిస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.