Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు చెక్.. రూ.24 వేల కోట్ల మెట్రో విస్తరణకు ప్లాన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ నగర అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం, మూసీ నది పునరుద్ధరణ వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. శాసన మండలి వేదికగా మాట్లాడిన సీఎం, నగర అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్తో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా ట్రాఫిక్, వర్షాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సీఎం తెలిపారు. హైదరాబాద్ను చారిత్రాత్మక నగరంగా అభివర్ణిస్తూ, మానవ తప్పిదాల వల్లే ప్రస్తుత సమస్యలు ఉత్పన్నమయ్యాయని పేర్కొన్నారు.
వివరాలు
ట్రాఫిక్ నియంత్రణ కోసం తీసుకోనున్న చర్యలు
రోడ్లను మూడు వర్గాలుగా విభజించడం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం సిగ్నల్ వ్యవస్థ తగ్గింపు మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు 'ఆపరేషన్ రోప్' అమలు మెట్రో విస్తరణకు రూ.24 వేల కోట్ల ప్రణాళిక హైదరాబాద్ మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. రూ.24 వేల కోట్లతో 74 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపట్టనున్నారు. ఎయిర్పోర్ట్కు మెట్రో కనెక్టివిటీ కల్పించడం కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభమైందని సీఎం గుర్తుచేశారు. నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా హైదరాబాద్ మెట్రో ర్యాంక్ 12వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు.
వివరాలు
కాలుష్య నియంత్రణకు చర్యలు
నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమలను నగర పరిధి బయటకు తరలిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకోసం సుమారు 9 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తీసుకువచ్చి మల్టీ యూజ్ జోన్లుగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అదే సమయంలో అపార్టుమెంట్ల నిర్మాణం ద్వారా గృహ అవసరాలను తీర్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది
వివరాలు
మూసీ నది అభివృద్ధి లక్ష్యం
మూసీ నది పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గంగా నది, సబర్మతి నది తరహాలో మూసీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించకుండా, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైతే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి ట్రాఫిక్ నిర్వహణ, మెట్రో విస్తరణ, కాలుష్య నియంత్రణ, నది పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై సమగ్ర ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఈ చర్యలు అమలైతే నగర మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.