Supreme Court: చట్టాలను పాటించకపోతే.. దేశం నుంచి వెళ్లిపోండి: మెటాపై సుప్రీం ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయుల గోప్యతతో ఆటలాడే హక్కు ఏ కంపెనీకీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ డేటాలోని ఒక్క సమాచారం కూడా అనుమతి లేకుండా పంచుకోవడం జరగకూడదని తేల్చిచెప్పింది. భారత చట్టాలను గౌరవించని పరిస్థితుల్లో కంపెనీలు దేశాన్ని విడిచిపోవాల్సి వస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. 2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీపై దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వాట్సప్ యూజర్ల డేటాను వ్యాపార లాభాల కోసం మెటాతో పంచుకుంటోందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఇది వినియోగదారులపై జరుగుతున్న దోపిడీతో సమానమని ప్రభుత్వ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
వివరాలు
మెటా నిబంధనలను అర్థం చేసుకోవడం కొన్నిసార్లు న్యాయస్థానానికే కష్టం
దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి మెటా విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెటా తీసుకొచ్చే నిబంధనలను అర్థం చేసుకోవడం కొన్నిసార్లు న్యాయస్థానానికే కష్టంగా మారుతోందని అన్నారు. తనకు ఒకసారి వైద్యుడు వాట్సప్లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపిన తర్వాత, అదే విషయానికి సంబంధించిన ప్రకటనలు ఫోన్లో కనిపించాయని ఉదాహరణగా చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని లక్షలాది మంది పేదలు, చదువులేని వారు ఈ పాలసీలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు.
వివరాలు
ఏమిటీ ప్రైవసీ పాలసీ?
2021 జనవరిలో వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం, యూజర్లు వాట్సప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే చాట్స్కు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్ (మెటా)తో పంచుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త నిబంధనలకు అంగీకరించని వారి ఖాతాలను నిలిపివేస్తామని తొలుత హెచ్చరికలు జారీ చేసింది.
వివరాలు
ఈ పాలసీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత
ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని పలు వర్గాలు అభ్యంతరం తెలిపాయి. పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, కొత్త పాలసీ అమలును తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ చట్టంలోని నిబంధనలకు ఈ పాలసీ పూర్తి విరుద్ధంగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ పాలసీపై దాఖలైన పిటిషన్ను తాజాగా విచారించిన సుప్రీంకోర్టు, మెటా తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.