Page Loader
CM Chandrababu: విజయవాడ బైపాస్‌ రోడ్డుకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌.. జూన్‌ ఆఖరుకు రాకపోకలు
విజయవాడ బైపాస్‌ రోడ్డుకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌.. జూన్‌ ఆఖరుకు రాకపోకలు

CM Chandrababu: విజయవాడ బైపాస్‌ రోడ్డుకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌.. జూన్‌ ఆఖరుకు రాకపోకలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ బైపాస్‌ రహదారికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చారు. ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం పనులను వేగంగా పూర్తి చేసి,జూన్‌ చివరి నాటికి వాహనాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయానికి పెండింగ్‌ పనులన్నింటినీ ముగించి,కాజ నుంచి వెంకటపాలెం,గొల్లపూడి మీదుగా చిన్న అవుటపల్లి వరకు బైపాస్‌ను ప్రారంభించనున్నారు. తరువాత,నాలుగు గ్రిడ్‌ రోడ్ల వద్ద అండర్‌పాస్‌లు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నారు. రాజధాని ప్రాంతానికి అనుసంధానమయ్యే ఈ రహదారి వెంటనే అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉన్నందున, సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాజధాని ప్రాంతానికి చేరుకునే ప్రధాన హైవే సులభంగా లభ్యమవడమే కాకుండా,నగర నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తక్కువ సమయంలో తరలించేందుకు కూడా వీలు కలుగుతుంది.

వివరాలు 

విజయవాడ బైపాస్‌ నిర్మాణ వివరాలు 

కాజ నుంచి గొల్లపూడి మీదుగా చిన్న అవుటపల్లి వరకు నిర్మిస్తున్న చెన్నై-కోల్‌కతా హైవే బైపాస్‌లో, కాజ-గొల్లపూడి ప్యాకేజీ భాగంగా 17.88 కి.మీ. పొడవు కలిగిన మార్గం రూపొందించారు. ఇది రాజధాని ప్రాంతంలోని తొమ్మిది గ్రిడ్‌ రోడ్లను దాటి వెళుతుంది.ఇందులో,ఇ-3, ఇ-8, ఇ-10, ఇ-13, ఇ-15 వంటి గ్రిడ్‌ రోడ్ల వద్ద నేషనల్‌ హైవే అథారిటీ (NHAI) అండర్‌పాస్‌లు నిర్మించింది. దీంతో,ఈ మార్గాల్లో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.అయితే, ఇ-9, ఇ-11, ఇ-12, ఇ-14 గ్రిడ్‌ రోడ్ల వద్ద అండర్‌పాస్‌లు లేకుండా బైపాస్‌ను నిర్మించడంతో,ఈ రోడ్లు శాశ్వతంగా మూసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు బైపాస్‌ను దాటి వెళ్లాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉంది.

వివరాలు 

అండర్‌పాస్‌ల నిర్మాణంపై సీఎం నిర్ణయం 

ఈ అసౌకర్యంపై గత వైకాపా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో, NHAI అధికారులు ప్రస్తుత నిర్మాణ పనులను కొనసాగించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఈ లోపాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు, సంబంధిత ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు తప్పనిసరిగా నిర్మించాలనే ఆదేశాలు జారీ చేశారు. ఇంజినీర్లు ప్రస్తుతం ఆ నాలుగు ప్రదేశాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణానికి అవసరమైన అంచనాలు సిద్ధం చేస్తున్నారు.

వివరాలు 

కేంద్రంతో చర్చించి నిర్ణయం 

ఇటీవల సీఎం చంద్రబాబు, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చలు జరిపారు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో, ముందుగా బైపాస్‌ పనులను పూర్తిచేయాలని, తరువాత అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం బైపాస్‌ పనులు నిలిపివేసి అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడితే దాదాపు 15 నెలలు ఆలస్యం అయ్యే అవకాశముండటంతో, ప్రథమంగా బైపాస్‌ను పూర్తిచేయడమే ఉత్తమ మార్గమని తేల్చారు. దీంతో, ఈ పనులు మరింత వేగంగా సాగుతాయని, వచ్చే వర్షాల నాటికి బైపాస్‌ పూర్తై అందుబాటులోకి వస్తుందని NHAI వర్గాలు వెల్లడించాయి.