Chandrababu Naidu: దుబాయ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్కు చేరుకున్నారు. పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించాలనే లక్ష్యంతో ఆయన మూడు రోజుల పాటు దుబాయ్లో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతోపాటు పలు రంగాల ప్రతినిధులతో కలిసి మొత్తం 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతోనూ సీఎం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, రాష్ట్రానికి ఉన్న సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలను వారికి వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న CII ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొనాలని అందరినీ ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
Details
పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు
దుబాయ్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం, "30 ఏళ్లుగా దుబాయ్ వస్తున్నా, ఈ సారి తెలుగు ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంలో గల్ఫ్ తెలుగు ప్రజల పాత్ర ఎంతో విశేషమని గుర్తుచేశారు. "మీరు సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓటు వేసి మాకు విజయాన్ని అందించారు. మీరు చూపిన నమ్మకాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను" అని అన్నారు.
Details
విశాఖపట్టణానికి గూగుల్ కంపెనీ
గల్ఫ్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. "నాడు నేను మిమ్మల్ని గ్లోబల్ సిటిజెన్స్గా మారాలని కోరుకున్నాను. ఇప్పుడు మీరు గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతున్నారంటే ఎంతో ఆనందంగా ఉందని సీఎం అన్నారు. అలాగే, "గతంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే, ఇప్పుడు విశాఖపట్నానికి గూగుల్ వస్తోందని తెలిపారు. 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.