Andhra Pradesh: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పిల్లలు సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 13సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తే మంచిదని సూచనలు వచ్చినట్లు సీఎం చెప్పారు. ఆ వయసు లోపు ఉన్న వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే చర్యలను ప్రభుత్వం వచ్చే 90 రోజుల్లో ప్రారంభిస్తుందని తెలిపారు.
వివరాలు
టెక్నాలజీకి బానిసలైతే మాత్రం జీవితాలు దెబ్బతినే ప్రమాదం
ఇక 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల విషయంలో ఎలాంటి విధానం అమలు చేయాలన్న అంశంపై నిపుణులు,సంబంధిత వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతినకూడదని ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. టెక్నాలజీని సరైన విధంగా వినియోగిస్తే అది శక్తివంతమైన సాధనంగా మారుతుందని, అయితే దానికి బానిసలైతే మాత్రం జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.