Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్కు నేడు చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు. రాష్ట్రాన్నిఅత్యాధునిక సాంకేతిక రంగంలో ముందంజలో నిలబెట్టాలనే లక్ష్యంతో అక్కడ పలువురు పరిశ్రమల ప్రముఖులతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ఉదయం 9.30 గంటలకు'ఏఐ యాక్సిలరేటర్స్-ఇండియా ఆర్థిక వృద్ధికి దోహదం' అనే అంశంపై జరిగే ప్రత్యేక సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొంటారు. అనంతరం కృత్రిమ మేధస్సు (ఏఐ),క్వాంటమ్ సాంకేతికత,సైబర్ భద్రత వంటి రంగాల్లో రాష్ట్రంలోని పది లక్షల మంది యువతకు శిక్షణ అందించే దిశగా ఐబీఎం సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు.
వివరాలు
ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు
అదేవిధంగా క్వాంటమ్-ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్థాపన కోసం యూనిసిస్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ స్థాపనకు ఎన్ఐఈఎల్ఐటీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ అభివృద్ధి కోసం ఐఐటీ-మద్రాస్తో మరో ఒప్పందం కుదరనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించనున్నారు. క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీధర్ గాంధీతో కూడా సీఎం ప్రత్యేకంగా భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు 'ఏఐ ద్వారా పోటీతత్వం' అనే అంశంపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు.
వివరాలు
ఆటోడెస్క్ ఏఐ విభాగాధిపతి మైక్ హాలేలతో సీఎం సమావేశం
ఈ చర్చల్లో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సీఈఓ బోర్జ్ బ్రెండేతో కలిసి వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు పంచుకోనున్నారు. యూకే ప్రతినిధి బృందంతో మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు సమావేశమవుతారు. బ్రిటన్ ఏఐ, ఆన్లైన్ భద్రత శాఖ మంత్రి కనిష్క నారాయణ్, వాతావరణం-సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సెలర్ శాలీ టేలర్, భారత్లో యూకే హై కమిషనర్ లిండీ కెమరాన్లతో పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు అరామ్కో ఇండియా ఎండీ అబ్దుల్ రెహమాన్ అయితుకైర్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ విభాగాధిపతి మైక్ హాలేలతో సీఎం వేర్వేరు సమావేశాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాల అనంతరం ఆయన దిల్లీ నుంచి అమరావతి బయలుదేరనున్నారు.