CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి అరుదైన గౌరవం… హార్వర్డ్ ఏఐ సదస్సుకు ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (హెచ్కేఎస్) మార్చిలో నిర్వహించనున్న తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ సదస్సుకు దేశం నుంచి ఆయన ఒక్కరికే ఆహ్వానం రావడం విశేషం. హెచ్కేఎస్ డీన్ జెరెమీ వీన్స్టయిన్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్వాహకురాలు రుక్సాండా రెనిటా సహా ఇతర సభ్యులు సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచే వర్చువల్గా పాల్గొని ప్రసంగిస్తానని రేవంత్రెడ్డి వారికి తెలియజేశారు.
Details
సీఎంను కలిసిన విద్యార్థులు
అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీలో తన చివరి రోజున సీఎం రేవంత్రెడ్డి వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో పాటు యూనివర్సిటీలోని పలు పాఠశాలల విద్యార్థులు, ఎంఐటీ, కొలంబియా వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల క్యాంపస్లకు చెందిన విద్యార్థులు, పూర్వవిద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వం, విజయాల సాధన, ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి నమూనాలు, స్థిరత్వం, పర్యావరణ పరిరక్షణ, రైతు సంక్షేమం, మహిళలు-యువత సాధికారత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Details
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
అలాగే 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ను వివరించిన సీఎం, ఈ లక్ష్యంతో సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, ఫలాలు అందడంతో పాటు సమగ్ర సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు. హార్వర్డ్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు దేశానికి తిరిగి వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, 'తెలంగాణ రైజింగ్' రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన పలువురు విద్యార్థులు తెలంగాణ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.