LOADING...
Cm Vijay: అవినీతిపై విజయ్ ప్రభుత్వం కఠిన వైఖరి.. దర్యాప్తులకు నిర్దిష్ట గడువులు
అవినీతిపై విజయ్ ప్రభుత్వం కఠిన వైఖరి.. దర్యాప్తులకు నిర్దిష్ట గడువులు

Cm Vijay: అవినీతిపై విజయ్ ప్రభుత్వం కఠిన వైఖరి.. దర్యాప్తులకు నిర్దిష్ట గడువులు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాష్ట్రంలో అవినీతిని అరికట్టే దిశగా సీఎం విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదయ్యే అవినీతి కేసులు, శాఖాపరమైన క్రమశిక్షణా విచారణలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండకుండా కాలపరిమితితో కూడిన సమగ్ర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన విచారణలు దీర్ఘకాలంగా కొనసాగుతున్న అంశంపై ఇటీవల మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణల్లో అనవసర జాప్యానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించడంతో పాటు, అన్ని శాఖల్లో పారదర్శకత పెరిగేలా స్పష్టమైన విధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది.

వివరాలు

పదోన్నతులు, పింఛన్ ప్రయోజనాలకు ఆటంకం లేకుండా చర్యలు..

పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా కేసుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, పింఛన్ ప్రయోజనాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు, గడువులను అమల్లోకి తీసుకొచ్చింది. అవినీతి నిరోధక శాఖలో నమోదైన ప్రతి కేసులో, కేసు నమోదు చేసిన తేదీ నుంచి మూడు నెలలలోపు తుది నివేదిక ముసాయిదాను తప్పనిసరిగా సిద్ధం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులపై నేరపూరిత దుష్ప్రవర్తన ఆరోపణలకు సంబంధించిన క్రమశిక్షణా చర్యల ప్రక్రియను గరిష్టంగా తొమ్మిది నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

వివరాలు

మార్గదర్శకాలు ఏవంటే..

విచారణకు అవసరమైన అన్ని పత్రాలు, సంబంధిత సాక్ష్యాధారాలను నాలుగు నెలలలోపు సంబంధిత శాఖకు అందించాలి. అవినీతి కేసుల్లో ఛార్జిషీట్ దాఖలైన అనంతరం, దర్యాప్తు అధికారి ఆరు నెలల్లోగా దర్యాప్తును పూర్తి చేయాలి. ఆ తర్వాత రెండు వారాల్లో తుది నివేదికను సమర్పించడం తప్పనిసరి. విచారణ నోటీసు అందిన తేదీ నుంచి ఇరవై రోజులలోపు ప్రభుత్వం సంబంధిత అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Advertisement