Parandur Airport: పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతులకు భారీ ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ప్రతిపాదించిన పరందూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ప్రాజెక్ట్ను పూర్తిగా విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య ఈ అంశంపై రాజకీయ వివాదం మరింత ముదిరింది. చెన్నైకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరందూర్ ప్రాంతంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. అయితే ప్రాజెక్ట్ కోసం వ్యవసాయ భూములను సేకరించడం వల్ల పంటలు, జలాశయాలు, పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా వారు చాలాకాలంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు.
వివరాలు
రైతుల సంక్షేమమే ముఖ్యమన్న విజయ్
ఎన్నికలకు ముందే పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్ట్ను విజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై పెద్దగా స్పందించలేదు.
తాజాగా దీనిపై మాట్లాడిన ఆయన.. ప్రాజెక్ట్ను పూర్తిగా విరమించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
"మేము పరందూర్ విమానాశ్రయాన్ని వదిలేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా పోరాడిన నిరసనకారులకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను" అని విజయ్ ప్రకటించారు.
పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయాలు అవసరమే అయినప్పటికీ.. రైతుల సంక్షేమాన్ని పణంగా పెట్టి వాటిని నిర్మించకూడదని ఆయన పేర్కొన్నారు.
2024 అక్టోబర్లో విక్రవాండి సమావేశంలోనూ ఇదే విషయాన్ని తాను స్పష్టం చేసినట్లు గుర్తుచేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో భాగంగానే పరందూర్ విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించిన అన్ని చర్యలను ఉపసంహరించుకున్నామని తెలిపారు.
వివరాలు
రైతుల్లో హర్షం
విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పునఃసమీక్షిస్తామని ప్రకటించింది.
స్థానిక జలాశయాలు, సారవంతమైన వ్యవసాయ భూములను కాపాడేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతాలను అన్వేషించేందుకు సమగ్ర సమీక్ష చేపడుతున్నట్లు టీవీకే నాయకుడు సీటీఆర్ నిర్మల్ కుమార్ అప్పట్లో వెల్లడించారు.
ఇప్పుడు ప్రభుత్వం ప్రాజెక్ట్ను పూర్తిగా విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమ భూములు, జీవనోపాధి, పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన పోరాటానికి ఇది విజయమని వారు భావిస్తున్నారు.
వివరాలు
డీఎంకే తీవ్ర ఆగ్రహం
మరోవైపు పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్ట్ రద్దు నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీవ్రంగా మండిపడింది.
తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్పై అనవసర అనుమానాలు వ్యక్తం చేయకుండా సంబంధిత ఫైళ్లను పరిశీలించాలని విజయ్ను డిమాండ్ చేసింది.
డీఎంకే సీనియర్ నాయకుడు దురైమురుగన్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి తమ ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్లను తెరిచి పరిశీలించేందుకు తామే అనుమతి ఇస్తున్నామని అన్నారు.
వారంరోజుల్లోగా విజయ్ ఆ పని చేయకపోతే.. అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని హెచ్చరించారు.
పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్ట్ రద్దు ప్రకటనతో తమిళనాడులో రైతుల ఉద్యమానికి ఊరట లభించడంతో పాటు అధికార టీవీకే,ప్రతిపక్ష డీఎంకే మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రంగా మారింది.