LOADING...
Andhra Pradesh: ఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
ఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Andhra Pradesh: ఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వర్షాకాలానికి నాంది పలికే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ప్రస్తుతం రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో నైరుతి రుతుపవనాల ప్రవేశం ప్రజలకు ఉపశమనం కలిగించే పరిణామంగా మారింది. రుతుపవనాలు మరింత విస్తరించేందుకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

వివరాలు

పలు జిల్లాలో భారీ వర్షాల ఛాన్స్

రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో మండే ఎండల నుంచి ప్రజలకు కొంత ఊరట లభించనుంది. మరోవైపు రైతులు కూడా రుతుపవనాల రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ సాగు పనులకు ఈ వర్షాలు కీలకంగా మారనున్నాయి.

వివరాలు

ఆసక్తి ఎదురుచూస్తున్న ప్రజలు

ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో నైరుతి రుతుపవనాల ప్రవేశం రాష్ట్ర ప్రజలకు చల్లని కబురును అందించింది. ఇప్పుడు తొలి వర్షాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య మరియు ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోకి కూడా మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది

Advertisement