Loading...
Delhi: ప్రధాని ఇంటి ముందు.. రాహుల్‌, ప్రియాంక బైఠాయింపు
ప్రధాని ఇంటి ముందు.. రాహుల్‌, ప్రియాంక బైఠాయింపు

Delhi: ప్రధాని ఇంటి ముందు.. రాహుల్‌, ప్రియాంక బైఠాయింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం, విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్‌ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ మంగళవారం ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పవన్‌ ఖేరా, కేసీ వేణుగోపాల్‌, దీపేందర్‌ హుడా, డీకే శివకుమార్‌, రాజా వారింగ్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు పాదయాత్రగా లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసం వైపు బయలుదేరారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

వివరాలు 

ర్యాలీ నిర్వహించేందుకు ముందస్తు అనుమతి లేదు 

పోలీసులు అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌ నేతలు అక్కడికక్కడే ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనలో పాల్గొన్న కొందరు కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ర్యాలీ నిర్వహించేందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు పేర్కొనగా, శాంతియుత నిరసన హక్కును కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు.

నిరసనలో భాగంగా పలువురు నేతలు తమ చేతులను ప్లాస్టిక్‌ ట్యాగ్‌లతో కట్టేసుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

వివరాలు 

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో మోదీ, షా, ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్

ధర్నా సందర్భంగా రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

విద్యార్థులపై జరిగిన దాడికి ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

యువత భవిష్యత్తును దెబ్బతీసినందుకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు.

ఇదిలా ఉండగా, సోమవారం జరిగిన ఆందోళనలో గాయపడిన విద్యార్థులను రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ న్యూఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

ADVERTISEMENT