LOADING...
Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘనవిజయం.. తొలి విడతలో హస్తం ఆధిపత్యం
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘనవిజయం.. తొలి విడతలో హస్తం ఆధిపత్యం

Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘనవిజయం.. తొలి విడతలో హస్తం ఆధిపత్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్యంగా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. గురువారం నిర్వహించిన తొలి దఫా గ్రామపంచాయతీ పోలింగ్‌ ఫలితాలు అర్ధరాత్రి రెండు గంటల దాకా వస్తూనే ఉండగా, ఏకగ్రీవాలతో పాటు మొత్తం 2,383 సర్పంచ్‌ స్థానాల్లో కాంగ్రెస్‌కు అనుకూల అభ్యర్థులు విజయం సాధించారు. సిద్దిపేట ఒక్క జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. పలు చోట్ల గట్టిపోటీ ఇచ్చిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి 1,146 పంచాయతీల్లో గెలిచింది. స్వతంత్రులు 455 పంచాయతీల్లో విజయం సాధించగా, వీరిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. భాజపా రెండువందల లోపు స్థానాలకు పరిమితమైంది.

వివరాలు 

396 పంచాయతీలు ఏకగ్రీవం

తీవ్రమైన చలి ఉన్నప్పటికీ ఉదయం ఆరు గంటలకే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఏడుగంటలకు ఓటింగ్‌ ప్రారంభమయ్యాక మహిళలు పిల్లలతో, వృద్ధులు కొంతమంది అంబులెన్స్‌ సాయంతో కూడా కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో తొలి విడతలో 396 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, మిగిలిన 3,834 సర్పంచ్‌ స్థానాలు, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరిగింది. మొత్తం ఓటింగ్‌ శాతం 84.28గా నమోదైంది. భారీస్థాయిలో పోలింగ్‌ జరిగిన జిల్లాల్లో యాదాద్రి-భువనగిరి అగ్రస్థానంలో నిలిచింది (92.88%), అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం ఓట్లు నమోదయ్యాయి.

వివరాలు 

అర్ధరాత్రి దాకా సాగిన ఓట్ల లెక్కింపు 

మొత్తం 53,57,277 మంది నమోదు చేసిన ఓటర్లలో 45,15,141 మంది ఓటు వేశారు. వీరిలో మహిళలు అత్యధికంగా 23,15,796 ఓట్లు, పురుషులు 21,99,267 ఓట్లు, ఇతరులు 78 ఓట్లు నమోదయ్యాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం ఒక గంటకు ప్రశాంతంగా పోలింగ్‌ ముగియగా, రెండుగంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. చాలా కేంద్రాల్లో కేవలం ఒకటి లేదా రెండు ఓట్ల తేడాతో విజయం నిర్ణయించాల్సిన పరిస్థితి రావడంతో పలుసార్లు రీకౌంటింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో లెక్కింపు అర్ధరాత్రి దాటాకా కొనసాగింది.

Advertisement

వివరాలు 

వార్డు సభ్యుల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌  

నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్, కామారెడ్డి, జనగామ, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, రాజన్న-సిరిసిల్ల, వికారాబాద్, ములుగు, జయశంకర్‌-భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం సాధించగా, సిద్దిపేట జిల్లాలో మాత్రం భారత రాష్ట్ర సమితి ముందంజలో నిలిచింది. మహబూబ్‌నగర్, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఇరుపార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. వార్డు సభ్యుల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ మద్దతుదారులు మరిన్ని స్థానాలను గెలుచుకున్నారు.

Advertisement

వివరాలు 

రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్‌ సాధన 

గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలోని వోక్సేన్‌ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఈ నెల 13న ఉప్పల్‌ స్టేడియంలో ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీతో కలిసి రేవంత్‌రెడ్డి స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే.

Advertisement