Page Loader
CJI Justice BR Gavai: పార్లమెంటు కన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనది..: జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ 
పార్లమెంటు కన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనది..: జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌

CJI Justice BR Gavai: పార్లమెంటు కన్నా రాజ్యాంగమే అత్యున్నతమైనది..: జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో పార్లమెంటే సుప్రీం అని భావించే వారు ఎందరో, తన అభిప్రాయం ప్రకారం రాజ్యాంగమే సర్వోన్నతమైందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు అన్నీ రాజ్యాంగ పరిమితులలోనే పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు మార్చలేన్న నిబంధన ఉందని గుర్తు చేశారు. మహారాష్ట్ర అమరావతిలో బార్‌ అసోసియేషన్‌ తరఫున జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో ఏది ప్రాధాన్యత కలిగి ఉందనే విషయంపై తరచూ చర్చలు జరుగుతుంటాయని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు.

వివరాలు 

నైతిక సూత్రాలను కాపాడటమే న్యాయమూర్తుల ప్రధాన బాధ్యత

ఏదైనా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినంత మాత్రాన న్యాయమూర్తులు పూర్తిగా స్వతంత్రులవుతారనుకోకూడదన్నారు. ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, నైతిక సూత్రాలను కాపాడటమే న్యాయమూర్తుల ప్రధాన బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. తాను 'బుల్డోజర్‌ న్యాయం'కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, ప్రజల జీవన హక్కును అత్యున్నతంగా పరిగణించానని జస్టిస్‌ గవాయ్‌ వివరించారు. ఇది ప్రజాస్వామ్యంలో కీలకమైన అంశమని కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌కు చెందిన జస్టిస్‌ ప్రవీణ్‌ పాటిల్‌, జస్టిస్‌ అనిల్‌ కిలోర్‌ తదితర ప్రముఖ న్యాయమూర్తులు హాజరయ్యారు.