Core Engineering: ఇంజినీరింగ్లో కోర్ బ్రాంచ్లకు మళ్లీ ఆదరణ.. సీఎస్ఈ డిమాండ్ తగ్గుముఖం
ఈ వార్తాకథనం ఏంటి
ఐటీ రంగంలో నియామకాలు తగ్గడం, పలు ప్రముఖ సంస్థలు ఉద్యోగుల తొలగింపులు (లేఅఫ్లు) చేపడుతుండటంతో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కొత్త ధోరణి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే కోర్ ఇంజినీరింగ్ కోర్సులైన మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), సివిల్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ)పై విద్యార్థుల ఆసక్తి పెరుగుతోందని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. దేశంలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో ఈసీఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు వారు వెల్లడించారు. డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాలను మినహాయిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈసీఈలో 30,763, సివిల్లో 7,490, మెకానికల్లో 9,215, ఈఈఈలో 10,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
మెకానికల్కు పెరుగుతున్న ప్రాధాన్యం
ప్రైవేటు కళాశాలల్లో మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తుండగా, మిగిలిన 30 శాతం సీట్లను యాజమాన్య కోటాలో కళాశాలలు కేటాయిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసీఈ తర్వాత మెకానికల్, ఈఈఈ, సివిల్ బ్రాంచ్లను కోరుకునే విద్యార్థుల సంఖ్య పెరిగిందని పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి వీరభద్రారెడ్డి తెలిపారు. కోర్ ఇంజినీరింగ్లో ముఖ్యంగా మెకానికల్ ఇంజినీరింగ్కు విద్యార్థులు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కళాశాలలు చెబుతున్నాయి. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తుండటంతో స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే అంచనాతో ఈ కోర్సును ఎంచుకుంటున్నారని పేర్కొంటున్నారు.
వివరాలు
మెకానికల్కు పెరుగుతున్న ప్రాధాన్యం
గతంలో మెకానికల్, ఈఈఈ, సివిల్ బ్రాంచ్లను ఎంచుకునే విద్యార్థులు తక్కువగా ఉండేవారని, ప్రస్తుతం యాజమాన్య కోటాలో 10 సీట్లు ఉంటే కనీసం ఏడుగురు ఈ కోర్సుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శివాజీ తెలిపారు. అదే సమయంలో డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల నుంచి పోటీ పెరగడంతో సాధారణ ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) సీట్లకు గతంతో పోలిస్తే డిమాండ్ కొంత తగ్గినట్లు పలు కళాశాలల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
సాఫ్ట్వేర్ బ్రాంచ్ల్లోనే 52 శాతం సీట్లు
సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయనే అంచనాతో ఈ ఏడాది కూడా కళాశాలలు సీఎస్ఈ,ఐటీ వంటి బ్రాంచ్ల్లో సీట్లను భారీగా పెంచాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్లో మొత్తం సీట్లలో 52 శాతం సాఫ్ట్వేర్కు సంబంధించిన కోర్సులకే కేటాయించబడ్డాయి. ఈ విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ మొత్తం 1,84,970 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి ఇవ్వగా, అందులో 97,099 సీట్లు సీఎస్ఈ,ఐటీ వంటి సాఫ్ట్వేర్ ఆధారిత బ్రాంచ్లకే ఉన్నాయి. ఇప్పటికే డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఈ సీట్లు దాదాపు పూర్తిగా భర్తీ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు అదనంగా 6,210 సీట్లు, ప్రభుత్వ కళాశాలలకు 390 సీట్లను ఏఐసీటీఈ మంజూరు చేసింది. అయితే ఈ అదనపు సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు.
వివరాలు
కొత్త కోర్సులకు ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్
ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ-కలికిరి, జేఎన్టీయూ-పులివెందుల, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలు ఈ ఏడాది ఇంజినీరింగ్లో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నాయి. ఏఐ-మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజినీరింగ్ (కన్స్ట్రక్షన్ టెక్నాలజీ), ఏఐ-డేటా సైన్స్ వంటి ప్రతి కొత్త కోర్సుకు 60 సీట్ల చొప్పున ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది.