Hyderabad Traffic Problem : హైదరాబాద్ ఐటీ కారిడార్ ట్రాఫిక్కు చెక్.. సైబరాబాద్ పోలీసుల 'పంచసూత్రాల' ప్లాన్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో కేవలం రెండు, మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకే వాహనదారులు గంటల తరబడి రోడ్లపై గడపాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిసే సమయంలో ఈ ఇబ్బందులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లో పనిచేసే ఉద్యోగులకు వర్షాకాలం వచ్చిందంటే ట్రాఫిక్ ఆందోళన మొదలవుతోంది. వర్షం పడితే గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతి ఏటా కొత్త కంపెనీలు, పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఈ సమస్యకు ప్రధాన కారణాలను గుర్తించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. రద్దీని తగ్గించేందుకు పంచసూత్రాలతో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.
వివరాలు
1. క్యాబ్లు, ఆటోలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు
ఐటీ కారిడార్లో సుమారు 1,200 చిన్నా, పెద్దా ఐటీ కంపెనీలు ఉండగా.. దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసేందుకు కంపెనీల ప్రధాన ద్వారాల వద్ద రహదారులపైనే క్యాబ్లు, ఆటోలు నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
ఇకపై ఈ వాహనాలను నిలిపేందుకు కంపెనీలే ప్రత్యేక ప్రాంతాలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
వివరాలు
2. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి
ఐటీ ఉద్యోగులు సొంత వాహనాల్లో కార్యాలయాలకు రావడం కూడా రోడ్లపై వాహనాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా మారింది.
దీనికి పరిష్కారంగా కంపెనీలు కార్ పూలింగ్ను ప్రోత్సహించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రతిపాదించారు.
ఒకే ప్రాంతం నుంచి వచ్చే ఉద్యోగులు కలిసి ప్రయాణిస్తే రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వివరాలు
3. కంపెనీ గేట్ల వద్ద ప్రత్యేక శిక్షణ
కార్పొరేట్ కంపెనీల ప్రధాన ద్వారాల నుంచి ఒకేసారి ఉద్యోగుల వాహనాలు, ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన బస్సులు బయటకు రావడంతో రహదారులపై ఒక్కసారిగా రద్దీ పెరుగుతోంది.
దీనిని నియంత్రించేందుకు కంపెనీల ప్రధాన ద్వారాల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పోలీసులు సూచించారు.
వివరాలు
4. తక్కువ బస్సులతో మెరుగైన రవాణా
కొన్ని కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వారి రాకపోకల కోసం ఎక్కువ సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
దీనికి బదులుగా ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంతాలను గుర్తించి.. తక్కువ బస్సులతో ఎక్కువ మందిని పికప్, డ్రాప్ చేసే విధానాన్ని అమలు చేయాలని పోలీసులు ప్రతిపాదించారు.
తద్వారా రోడ్లపై బస్సుల సంఖ్యను తగ్గించి ట్రాఫిక్ను నియంత్రించవచ్చని భావిస్తున్నారు.
వివరాలు
5. జోన్ల వారీగా లాగిన్, లాగౌట్ సమయాలు
ఐటీ కంపెనీల లాగిన్, లాగౌట్ సమయాలు ఒకేలా ఉండటంతో ఉద్యోగులంతా ఒకేసారి రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా ఐటీ కారిడార్ను జోన్లుగా విభజించి కంపెనీల లాగిన్, లాగౌట్ సమయాలను వేర్వేరుగా అమలు చేయాలని పోలీసులు సూచించారు.
పెద్ద కంపెనీలు ఒకే సమయంలో కాకుండా కొంత వ్యవధితో ఉద్యోగుల లాగిన్, లాగౌట్ సమయాలను నిర్వహించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు.
ఈ ఐదు సూత్రాలను సమర్థంగా అమలు చేస్తే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.
కంపెనీలు, ఉద్యోగులు సమన్వయంతో ఈ విధానాలను పాటించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.