Telangana: మొంథా తుపాను ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఈశాన్య జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అలాగే మరికొన్ని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదనంగా ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారి అదే ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Details
ఈ నెల 28 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం
రాబోయే 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశలో కదిలి, మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వివరించారు. ఈ తుపాను తరువాత నైరుతి బంగాళాఖాతం, దానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇది మొదట వాయవ్య దిశలో, ఆపై ఉత్తర వాయవ్య దిశలో కదిలి ఈ నెల 28 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాక, ఈ తుపాను తూర్పు వాయువ్య దిశలో కదులుతూ, 28న సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం-కాళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.