 
                                                                                CYCLONE MONTHA: బంగాళాఖాతంలోవాయుగుండంగా బలపడుతున్న మొంథా తుపాను
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా తీవ్రత సాధిస్తూ "మొంథా" అనే తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను నైరుతి-ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. గత ఆరు గంటల్లో సుమారు గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగిందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయానికి ఈ వ్యవస్థ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయ దిశగా 710 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్లు, చెన్నైకు తూర్పు-ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభం
తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీప తీరంలో మంగళవారం తుపాను భూభాగాన్ని తాకే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 90 నుండి 110కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని సూచించారు. మొంథా తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితుల కోసం అధికారులందరి సెలవులను రద్దు చేసింది. సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.19 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎస్డీఆర్ఎఫ్ (SDRF),ఏపీఎస్డీఎంఏ (APSDMA)నియంత్రణ కేంద్రాలను చురుకుగా పనిచేయనిచ్చి, 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేసింది.
వివరాలు
విద్యాసంస్థలకు సెలవులు, విపత్తు బృందాల మోహరింపు
తీర ప్రాంతంలోని 57 మండలాల్లో మొత్తం 219 తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. అలాగే, సముద్రంలో ఉన్న 62 మెకనైజ్డ్ బోట్లను భద్రత కోసం ఒడ్డుకు రప్పిస్తున్నారు. తుపాను ప్రమాదం నివారించేందుకు తీర ప్రాంత పర్యాటక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు.
వివరాలు
సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా నేడుసెలవు ప్రకటించారు. తుపాను పరిస్థితులకు ఎదుర్కోవడానికి విపత్తు నిర్వహణ బృందాలను జిల్లాలలో మోహరించారు. సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. టీఆర్-27 కింద జిల్లాలకు అత్యవసర నిధులు కేటాయించబడాయి. ఈ నిధులతో సహాయక శిబిరాలు, తాగునీరు, ఆహార సరఫరా వంటి ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు తెలిపారు.