
Delhi CM: సీఎంవో సమావేశంలో ముఖ్యమంత్రి భర్త.. దిల్లీలో 'ఫులేరా' ప్రభుత్వం అంటూ ఆప్ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ప్రభుత్వ అధికారిక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా భర్త మనీశ్ గుప్తా పాల్గొనడం అక్కడ రాజకీయాల్లో దుమారం మొదలైంది. అభివృద్ధి ప్రాజెక్టులపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి భర్త మనీశ్ గుప్తా పాల్గొనడం ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ విరుచుకుపడింది ప్రభుత్వంలో ఎటువంటి హోదా లేకున్నా.. అధికారిక సమీక్షల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని ఆప్ విమర్శించింది. దిల్లీలో 'ఫులేరా' పంచాయత్ వెబ్ సిరీస్ తరహా ప్రభుత్వం నడుస్తోందా? అంటూ ప్రశ్నించింది.
వివరాలు
భాజపా ఎందుకు నిశ్శబ్దంగా ఉంది?
"దిల్లీలో 'ఫులేరా' తరహా ప్రభుత్వం నడుస్తోంది? అనేక మంది అధికారులు, ఉద్యోగులతో కలిసి ముఖ్యమంత్రి రేఖా గుప్తా సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పక్కన కుర్చీలో భర్త మనీశ్ గుప్తా కూడా ఉన్నారు. ఇది స్పష్టంగా రాజ్యాంగ వ్యతిరేక చర్య. గతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనను విమర్శించినప్పుడు భాజపా పార్టీ కచ్చితంగా స్పందించేది. ఇప్పుడు అదే విషయం ఎదుర్కొంటున్నప్పుడే భాజపా ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? ఇది కుటుంబ పాలన కాదా? ముఖ్యమంత్రి తన భర్తకు అధికారాలు ఇవ్వాలని కోరుకుంటున్నారా? పాలన వ్యవహారాల్లో ఆయనను భాగస్వామ్యంగా ఎందుకు చేసుకుంటున్నారు?" అని ఆప్ నేత, దిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరధ్వాజ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కురిపించారు.
వివరాలు
తీవ్రస్థాయిలో మండిపడిన ఆప్
తాజాగా, దిల్లీకి చెందిన ఓ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి భర్త మనీశ్ గుప్తా,ఇతరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సీఎం రేఖా గుప్తా, సీఎంఓ (CMO) అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'పంచాయత్' వెబ్ సిరీస్ ఉదాహరణగా తీసుకుని, ఫులేరా గ్రామ సర్పంచ్గా మహిళ ఉన్నప్పటికీ అధికారిక కార్యక్రమాలను మాత్రం ఆమె భర్త చూసుకోవడాన్ని ప్రస్తావించింది.