Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పాక్ గూఢచారి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని ఢిల్లీలో భారీ గూఢచార్య సంచలనం చోటుచేసుకుంది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI)తో సంబంధాలు కలిగిన ఒక అణు గూఢచార్య నెట్వర్క్ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. వివరాల ప్రకారం.. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో భాగంగా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ బృందం, 59 ఏళ్ల మహమ్మద్ ఆదిల్ హుస్సైనీ (Mohammed Adil Husseini) అలియాస్ సయ్యద్ ఆదిల్ హుస్సైన్, నసీముద్దీన్, సయ్యద్ ఆదిల్ హుస్సైనీని అరెస్ట్ చేసింది. వీరిపై గూఢచార్య కార్యకలాపాలు,నకిలీ పాస్పోర్ట్ రాకెట్లో పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక విచారణలో, నిందితుడు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో పాటు,ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ (AEOI), ఒక రష్యన్ అణు శాస్త్రవేత్తతో కూడా సంబంధాలు కొనసాగించినట్లు వెలుగుచూసింది.
వివరాలు
BARC లో చొరబడేందుకు ప్రయత్నం
ఝార్ఖండ్లోని జంషెడ్పూర్ టాటానగర్కు చెందిన హుస్సైనీ, తన సోదరుడితో కలిసి శాస్త్రవేత్త రూపంలో భారత అగ్రశ్రేణి అణు పరిశోధనా కేంద్రం ..బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో చొరబడేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా హుస్సైనీ, ఒక రష్యన్ మూలం గల శాస్త్రవేత్త నుంచి అణు సంబంధిత డిజైన్లను సేకరించి, వాటిని ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ (AEOI)కు చెందిన ఇరానియన్ ఏజెంట్కు విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. అయితే, ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.