IndiGo Flight: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం.. ఢిల్లీ-మాంచెస్టర్ ఇండిగో విమానం యూ-టర్న్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి యుకేలోని మాంచెస్టర్కు బయలుదేరిన ఇండిగో విమానం మధ్యలోనే తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి మాంచెస్టర్కు బయలుదేరిన ఇండిగో 6E33 విమానం సుమారు ఏడు గంటలు ప్రయాణించిన తర్వాత యూ-టర్న్ తీసుకుని తిరిగి ఢిల్లీకి చేరుకుంటోంది. విమాన ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్రాడార్24 సమాచారం ప్రకారం ఈ విమానం ఎథియోపియా-ఎరిట్రియా సరిహద్దు ప్రాంతం వద్ద తిరిగి మళ్లింది. ఫిబ్రవరి 26 తర్వాత ఢిల్లీ-మాంచెస్టర్ మార్గంలో ఇండిగో ప్రారంభించిన మొదటి విమానం ఇదే.
వివరాలు
గగనతల పరిమితుల కారణంగా విమానం తిరిగి రావాల్సి వచ్చింది: అధికారులు
సాధారణంగా ఈ ప్రయాణం సుమారు 11 గంటల్లో పూర్తవుతుంది. అయితే పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమానం మధ్యప్రాచ్య గగనతలం దాటకుండా గల్ఫ్ ఆఫ్ అడెన్, ఆఫ్రికా ప్రాంతాల మీదుగా ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుని ప్రయాణించింది. అయినప్పటికీ చివరి నిమిషంలో విధించిన గగనతల పరిమితుల కారణంగా విమానం తిరిగి రావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారుతున్నందున కొన్ని విమానాలు పొడవైన మార్గాలు ఎంచుకోవాల్సి రావచ్చు లేదా మళ్లించాల్సి రావచ్చని తెలిపారు. అదే కారణంగా ఢిల్లీ నుంచి మాంచెస్టర్కు వెళ్తున్న 6E033 విమానాన్ని కూడా తిరిగి మూల స్థానం అయిన ఢిల్లీకి తీసుకురావాల్సి వచ్చిందన్నారు.
వివరాలు
ఢిల్లీ-మాంచెస్టర్ మధ్య దూరం సుమారు 6,829 కిలోమీటర్లు
ప్రస్తుతం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని, ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యం అని పేర్కొన్నారు. ఫ్లైట్రాడార్24 వివరాల ప్రకారం ఢిల్లీ-మాంచెస్టర్ మధ్య దూరం సుమారు 6,829 కిలోమీటర్లు. మార్గం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి సాధారణంగా ఈ ప్రయాణం దాదాపు 11 గంటలు పడుతుంది.
వివరాలు
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులు
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేపట్టిన తర్వాత మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయెల్,గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లక్ష్యాలపై ప్రతిదాడులు చేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావమే ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా పడుతోంది.