MP Kavya: కాజీపేట కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి.. లోక్సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
వరంగల్ ఎంపీ కడియం కావ్య కాజీపేటను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక రైల్వే జోన్ లేదా బలమైన సబ్జోన్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్సభలో రైల్వే బడ్జెట్పై జరిగిన చర్చలో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ నుంచి హైస్పీడ్ రైలు కారిడార్లు నిర్మించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. అదే సమయంలో రాజధాని అవసరాలను దృష్టిలో పెట్టుకుని రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించి, దాన్ని పరిశ్రమలు,లాజిస్టిక్స్ పార్క్లతో అనుసంధానం చేయాలని సూచించారు. కాజీపేట జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు రైల్వే అండర్ టన్నెల్ నిర్మాణం చేపట్టాలని, అలాగే కాజీపేటలో ప్రతిపాదిత రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు.
వివరాలు
సీఎస్ఆర్ కింద రూ.3,857 కోట్ల వ్యయం
ఆ యూనిట్లో ఉద్యోగాల విషయంలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. వరంగల్ నుంచి పుష్పుల్ రైలును కూడా ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల కింద రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 2019-20 నుంచి 2023-24 మధ్యకాలంలో మొత్తం రూ.3,857 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ సహాయమంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. లోక్సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం వ్యయంలో హైదరాబాద్లోనే రూ.2,054 కోట్లు, అంటే 53.25% ఖర్చు అయినట్లు చెప్పారు. ఇక మొత్తం నిధుల్లో విద్యా రంగానికి రూ.1,338 కోట్లు, అంటే 34.68% కేటాయించబడినట్లు వివరించారు.
వివరాలు
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై రెండు ప్రతిపాదనలు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి రెండు వేర్వేరు ప్రతిపాదనలు అందినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్ సాహు తెలిపారు. రాజ్యసభలో రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 76.4 కిలోమీటర్ల పొడవుతో కూడిన తొలి ప్రతిపాదన 2024 నవంబర్ 4న అందగా, 86.1 కిలోమీటర్ల ప్రాజెక్టుకు సంబంధించిన రెండో ప్రతిపాదన 2025 జూన్ 20న చేరినట్లు చెప్పారు. 2017 మెట్రో రైల్ విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సమగ్ర పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
వివరాలు
స్మార్ట్సిటీ ప్రాజెక్టుల్లో 85% పూర్తి
స్మార్ట్సిటీ పథకం కింద గ్రేటర్ వరంగల్ మరియు కరీంనగర్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో 85% పూర్తి అయినట్లు టోకన్ సాహు తెలిపారు. రాజ్యసభలో సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఈ రెండు నగరాలకు మొత్తం రూ.2,895 కోట్ల విలువైన 168 ప్రాజెక్టులు కేటాయించగా, అందులో రూ.2,520 కోట్లతో 143 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన రూ.375 కోట్ల విలువైన 25 ప్రాజెక్టులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేంద్రం తన వాటాగా వరంగల్కు రూ.377 కోట్లు, కరీంనగర్కు రూ.429 కోట్లు విడుదల చేసి వాటిని వినియోగించినట్లు వివరించారు.
వివరాలు
తెలంగాణ డిస్కంల అప్పులు రూ.59,230 కోట్లు
తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) అప్పులు 2025 మార్చి 31 నాటికి రూ.59,230 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్ తెలిపారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే సగటున 27 పైసలు అధిక ఆదాయం వస్తోందని కూడా వెల్లడించారు.