Dense Fog: పంజాబ్ టు బీహార్.. కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఐఎండీ వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర భారతదేశం ఈ రోజు దట్టమైన పొగమంచుతో నిండి ఉంది. పంజాబ్ నుంచి బిహార్ వరకు ఆకాశం విషపూరితంగా మారినట్లు కనిపిస్తోంది. గంగా నది పరివాహక ప్రాంతాల్లో దృశ్యాల విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. శుక్రవారం ఉదయం పరిస్థితి మరింత గంభీరంగా తయారైంది. ఈ నేపథ్యంలో భారతీయ వాతావరణ శాఖ (IMD) ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్లు, రైలు మార్గాలు, ఎయిర్ రూట్లు ఇలా ప్రయాణించే మార్గాల్లో సవాళ్లు తలెత్తే అవకాశం ఉన్నట్లు IMD పేర్కొంది. రాష్ట్రాల మీద దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోగా నమోదయింది.
వివరాలు
విమానాశ్రయాలు, జాతీయ రహదారులపై ప్రయాణాల్లో సమస్యలు
ప్రత్యేకంగా ఆగ్రా, బరేలీ,షహరాన్పూర్, గోరఖ్పూర్, అంబాలా,అమృత్సర్, బఠిండా, లూథియానా, ఆదమ్పూర్, షఫ్దార్గంజ్, గ్వాలియార్, భగల్పూర్,దాల్తోగంజ్ పట్టణాల్లో విజిబిలిటీ పూర్తిగా లేని స్థితి ఏర్పడింది. IMD ఇచ్చిన హెచ్చరిక ప్రకారం, విమానాశ్రయాలు, జాతీయ రహదారులపై ప్రయాణాల్లో సమస్యలు ఎదుర్కొనవచ్చని సూచించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, అలీఘడ్, భాగ్పట్, బరేలీ, బిజ్నోర్, బులంద్షెహర్, ఈటా, ఇట్వా, ఫిరోజ్బాద్, గౌతం బుద్ధనగర్, ఘజియాబాద్, హాపూర్, హత్రాస్, మథురా, మీరట్, మొరాదాబాద్, ముజాఫర్నగర్, ఫిలిభిట్, రాంపూర్, హరిద్వార్, ఉద్దమ్ సింగ్ నగర్, గురుదాస్ పూర్, పాటియాలా, సంగ్రూర్ వంటి పట్టణాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. IMD రోడ్డు ప్రయాణాలు సవాళ్లతో ఉంటాయని, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించాలని సూచించింది.