Gurpatwant Singh Pannun: నవంబరు 1-19 మధ్య ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించకండి.. గురు పత్వంత్ పన్నూ హెచ్చరిక
దేశంలో ఇటీవల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఈ పరిస్థితులలో ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ 'ఎయిర్ ఇండియా'కు హెచ్చరికలను జారీ చేయడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ 1 నుండి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఆయన పేర్కొన్నారు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన 40 సంవత్సరాల సందర్భంగా, ఎయిర్ ఇండియా విమానాలపై దాడులు జరగవచ్చని పన్నూ వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని వివరించడంతో పాటు, ఆయా తేదీలలో ఈ విమానాలలో ప్రయాణించవద్దని ఒక వీడియో సందేశంలో తెలిపాడు.
గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలను చేసిన పన్నూ
పన్నూ ఇలాంటి హెచ్చరికలను చేయడం మొదటిసారి కాదు, గత నవంబరులో కూడా ఇలాంటి వీడియో విడుదల చేశారు. గతేడాది నవంబర్ 19న దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడుతుందని దాని పేరు మారుస్తారని ఆయన హెచ్చరించారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థను 2007లో పన్నూ స్థాపించారు. 2019లో భారత ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద, 2020లో అతడిని ఉగ్రవాదిగా ప్రకటించారు.