మోదీ సభ ముందు రాజస్థాన్ బీజేపీలో ముసలం..వసుంధర రాజే, గజేంద్ర ఐక్యత నిలిచేనా
రాజస్థాన్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ మేరకు బీజేపీలో ముసలం తయారవుతోంది. ప్రధాని రాకకు ముందే రాష్ట్రంలో అనూహ్య సంఘటనలు జరిగాయి. మూడు రోజుల క్రితం నిర్వహించిన బీజేపీ పరివర్తన యాత్రకు ఆ పార్టీ కీలక నేత, మాజీ సీఎం వసుంధర రాజే డుమ్మా కొట్టారు. ఝలావర్ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం జరిగిన బీజేపీ పరివర్తన యాత్రకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరైనా రాజే గైర్హాజరయ్యారు. గత 33 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఝలావర్ లోని పరివర్తన యాత్రకు రాజే డుమ్మా కొట్టడం కలకలం రేపుతోంది. తన సొంత గడ్డ హదోటిలోని కోటా, బుండి, ఝలావర్ లోని యాత్రకు ఆమె గైర్హాజరయ్యారు. ఈ మేరకు అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
పరివర్తన్ యాత్రకు అందుకే డుమ్మా
2018లో గజేంద్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమాకాన్ని రాజే వ్యతిరేకించారు. అప్పట్నుంచి ఇద్దరి నేతల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరోవైపు పరివర్తన్ యాత్రకు ఉత్తరాఖండ్ సీఎం ధామి, రాజే తనయుడు దుష్యంత్ సింగ్ హాజరయ్యారు. సాధారణంగా ఈ ప్రాంతంలో రాజేకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె ఎప్పుడు బహిరంగ సభ పెట్టినా భారీగా ప్రజలు తరలివచ్చేవారు. ఈసారి మాత్రం జనం లేక సభలు వెలవెలబోయాయి. ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అనుకూల, వ్యతిరేక వర్గాలుగా కమలదళం చీలిపోయినట్టు ప్రచారం ఊపందుకుంది. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించకపోవడంపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో రాజే పాల్గొన్నారు.