LOADING...
Terror module: ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రలో నర్సు షాహిన్‌ కీలక పాత్ర.. రెండేళ్ల నుంచి  జైషే ప్రణాళికలు
రెండేళ్ల నుంచి జైషే ప్రణాళికలు

Terror module: ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రలో నర్సు షాహిన్‌ కీలక పాత్ర.. రెండేళ్ల నుంచి  జైషే ప్రణాళికలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫరీదాబాద్‌ (Faridabad) ఉగ్ర కుట్రలో పార్టనర్ అయిన డాక్టర్‌ షాహిన్‌ (Dr Shaheen)ను అధికారులు విచారించగా.. కీలక విషయాలు బయటపడ్డాయి. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం, దాదాపు రెండేళ్లుగా పాకిస్థాన్‌ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ (Jaish-e-Mohammed) కోసం విస్తృత స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఫరీదాబాద్‌ మాడ్యూల్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అరెస్టయిన షాహిన్‌ను పోలీసులు శ్రీనగర్‌కు తీసుకెళ్లి ప్రశ్నించగా, ఆమె చుట్టూ ఉన్న నెట్‌వర్క్‌ వివరాలు బహిర్గతమయ్యాయి. విచారణలో ఆమె వెల్లడించిన ప్రకారం,ఉగ్రవాది ఉమర్‌ దేశంలో పెద్ద ఎత్తున దాడులు చేయాలని తరచూ ఉత్సాహంగా చెప్పేవాడని పేర్కొంది.

వివరాలు 

రెండేళ్లుగా అమ్మోనియం నైట్రేట్‌ వంటి పేలుడు పదార్థాల సేకరణ 

అంతేకాక, డాక్టర్‌ ముజమ్మిల్‌, ఆదిల్‌తో కలిసి దాదాపు రెండేళ్లుగా అమ్మోనియం నైట్రేట్‌ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తూ, జైషే మహమ్మద్‌ ఆదేశాల మేరకు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలనే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అంగీకరించింది. తదుపరి విచారణలో షాహిన్‌ తన సోదరుడు పర్వేజ్‌ సయీద్‌ కూడా ఈ మాడ్యూల్‌లో భాగమని తెలిపింది. దాంతో జమ్ముకశ్మీర్‌ పోలీసులు అతడిని కూడా మంగళవారం అరెస్టు చేశారు. అయితే, అతడి వద్ద నుంచి ఎలాంటి పేలుడు పదార్థాలు స్వాధీనం కాలేదని అధికారులు తెలిపారు. కానీ, అరెస్టు అవుతానన్న అనుమానంతో అతడు అవి ఎక్కడో దాచి ఉంచి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

వివరాలు 

డాక్టర్‌ షాహిన్‌ అరెస్టు వెనుక జైషే మహమ్మద్‌ నెట్‌వర్క్

ఈ కేసులో గురుగ్రామ్‌ ప్రాంతానికి చెందిన అమ్మోనియం నైట్రేట్‌ సరఫరాదారుడి వివరాలను కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే ఆ వ్యక్తిపై దాడులు చేసి అదుపులోకి తీసుకొనే ప్రణాళికలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్‌ షాహిన్‌ అరెస్టు వెనుక జైషే మహమ్మద్‌ నెట్‌వర్క్‌ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జమాత్‌ ఉల్‌ మొమినాత్‌ అనే మహిళా విభాగానికి జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరి సాదియా అజార్‌ నేతృత్వం వహిస్తోందని, ఆ విభాగంలో షాహిన్‌ కీలక బాధ్యతలు నిర్వహించిందని సమాచారం చెబుతోంది. ఆమె భారత్‌లో మహిళా విభాగాలు ఏర్పాటు చేసి, వాటి నియామకాలు, కార్యకలాపాల పర్యవేక్షణలో చురుకుగా వ్యవహరించిందని కూడా తెలిసింది.

వివరాలు 

దిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కీలక అంశం

ఇదిలాఉండగా, దిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆ పేలుడులో ఉపయోగించిన పదార్థాల తీవ్రత, వాటి ప్రభావం బట్టి మిలిటరీ గ్రేడ్‌ పేలుడు పదార్థాలు వాడినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపై పూర్తివివరాలు విచారణ తర్వాత స్పష్టమవుతాయని సమాచారం.