Draft Voter List: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల నేడు .. ఆగస్టు 31 వరకు అభ్యంతరాలకు అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా సిద్ధం చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనుంది. ఈ జాబితాతో పాటు అనర్హులుగా గుర్తించిన ఓటర్ల ప్రత్యేక జాబితాను కూడా రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు అందజేయనున్నారు. సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) జూన్ 15 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు, ఓటర్లు నింపిన దరఖాస్తులను సేకరించి వాటిని డిజిటల్ రూపంలో నమోదు చేశారు.
వివరాలు
రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు తొలగింపు జాబితా
ఆంధ్రప్రదేశ్'లో ప్రస్తుతం మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు నమోదై ఉండగా, క్షేత్రస్థాయి పరిశీలనలో 44,89,488 మంది వివరాలను తొలగించాల్సిన జాబితా (ఏఎస్డీడీ)లో చేర్చారు.
ఆయా చిరునామాల్లో నివసించని వారు, ఆచూకీ లభ్యం కానివారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్న వారు, మరణించిన వారి పేర్లను ఈ జాబితాలో చేర్చినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఈ పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండవు.
ఈ తొలగింపు జాబితాను (ఏఎస్డీడీ) రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు ప్రత్యేకంగా అందజేస్తారు.
వీటిని మినహాయించి మొత్తం 3,71,38,206 మంది ఓటర్ల వివరాలతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
వివరాలు
అభ్యంతరాలు ఉంటే..
ముసాయిదా జాబితా లేదా ఏఎస్డీడీ జాబితాలోని వివరాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం నుంచి ఆగస్టు 31 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇ
దే కాలంలో కొత్తగా ఓటు నమోదు, చిరునామా మార్పు, వ్యక్తిగత వివరాల సవరణ, అనర్హుల పేర్ల తొలగింపు వంటి అంశాలకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను అధికారులు పరిశీలిస్తారు.
అర్హతలు ఉన్నట్లు తేలిన వారి పేర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చుతారు. అనర్హులుగా నిర్ధారణ అయితే వారి పేర్లను తొలగిస్తారు.
అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయనుంది.
వివరాలు
మ్యాపింగ్
ఇక, ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన వారిలో చాలామంది 2002 నాటి ఓటర్ల జాబితాతో తమ వివరాలు లేదా కుటుంబ సభ్యుల వివరాలను మ్యాపింగ్ చేయలేదని అధికారులు గుర్తించారు.
అలాంటి వారికి ప్రత్యేకంగా నోటీసులు జారీ చేయనున్నారు.
వీరు ఆధార్ కార్డు కాకుండా ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు
ఎన్నికల సంఘం ఆమోదించిన ధ్రువీకరణ పత్రాలు
ఎన్నికల సంఘం ఆమోదించిన ధ్రువీకరణ పత్రాల్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, పింఛనుదారులకు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పింఛన్ పేమెంట్ ఆర్డర్,1987 జూలై 1కు ముందు ప్రభుత్వం,స్థానిక సంస్థలు,బ్యాంకులు,పోస్టాఫీసులు,ఎల్ఐసీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రాలు,జనన ధ్రువీకరణ పత్రం,బోర్డు లేదా విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కుల చట్టం కింద జారీ చేసిన సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, అమల్లో ఉన్న ప్రాంతాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) నమోదు, రాష్ట్ర లేదా స్థానిక సంస్థలు నిర్వహించే కుటుంబ రిజిస్టర్, అలాగే ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రాలు ఉన్నాయి.